వివేకా కేసులో జగన్ కూడా నిందితుడు: బుద్దా వెంకన్న
ABN, First Publish Date - 2022-02-28T00:40:01+05:30
మాజీమంత్రి వివేకా కేసులో సీఎం జగన్ కూడా నిందితుడని, సీఎంగా ఉండేందుకు ఆయన అనర్హుడని టీడీపీ నేత బుద్దా వెంకన్న చెప్పారు.
అమరావతి: మాజీమంత్రి వివేకా కేసులో సీఎం జగన్ కూడా నిందితుడని, సీఎంగా ఉండేందుకు ఆయన అనర్హుడని టీడీపీ నేత బుద్దా వెంకన్న చెప్పారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం పదవికి జగన్ రాజీనామా చేసి సీబీఐ ముందు హాజరుకావాలన్నారు. వివేకా హత్య కేసు నుంచి దృష్టి మళ్లించేందుకే భీమ్లానాయక్పై వివాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. వివేకా హత్య కేసు దోషులను రక్షించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్ తన పేరు ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతున్నారని విమర్శించారు. జగన్కు తెలిసే వివేకానందరెడ్డి హత్య జరిగిందని తెలిపారు. అందుకే ఎంపీ అవినాష్రెడ్డిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
‘‘అవినాష్రెడ్డి, భాస్కరరెడ్డిలే చంపారని సాక్షులు చెప్పినా జగన్ స్పందించరా?.. అవినాష్రెడ్డిపై చర్యలు తీసుకోకపోగా రఘురామకృష్ణరాజును తొలగించాలని లేఖలు రాస్తారా. అవినాష్, భాస్కరరెడ్డిలను అరెస్ట్ చేస్తే తన కుట్ర బయపడుతుందని జగన్కు భయం. ప్రతిపక్షాల సవాళ్లను ఎదుర్కోకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. సీబీఐ అధికారిపై కూడా కేసులు పెట్టించడం జగన్ దుర్మార్గానికి పరాకాష్ట’’ అని బుద్దా వెంకన్న మండిపడ్డారు.
Updated Date - 2022-02-28T00:40:01+05:30 IST