ఫోరెన్సిక్కి పంపితే అరగంటలో నిజాలు నిగ్గు తేలేవి
ABN, First Publish Date - 2022-08-11T08:21:39+05:30
ఫోరెన్సిక్కి పంపితే అరగంటలో నిజాలు నిగ్గు తేలేవి
గోరంట్ల ఫోన్ను ఎందుకు సీజ్ చేయలేదు?: బొండా ఉమ
‘‘బ్లూ జీన్స్ వేసుకుని గంట రమ్మన్న మంత్రి అంబటి రాంబాబు.. అరగంట చాలన్న మాజీమంత్రి అవంతి శ్రీనివాస్.. వీడియో కాల్లో నగ్నంగా మహిళలను వేధిస్తున్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్... వీరి వ్యవహారాలను ఎందుకు తేల్చలేకపోతున్నారు?’’ అని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. ‘‘వారి ఆడియోలను, వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి ఉంటే అరగంట, గంటలోనే నిజాలు నిగ్గు తేలేవి. ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో తెలిసేది. నిజాలను నిగ్గు తేల్చే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా జగన్ ఎందుకు కాలయాపన చేస్తున్నారు? ఎంపీ గోరంట్లకు వ్యతిరేకంగా రిపోర్టు వచ్చింది కాబట్టే.. అనంతపురం ఎస్పీతో మాట్లాడించారు. తాడేపల్లి నుంచి వెళ్లిన స్ర్కిప్టునే ఆయనతో చెప్పించారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ఫోన్ సీజ్ చేసిన జగన్ ప్రభుత్వం మాధవ్ ఫోన్ను ఎందుకు సీజ్ చేయలేదు. మాధవ్ను రక్షించేందుకే పోలీసులు విచారణ చేపట్టారు’’ అని బొండా ఆరోపించారు.
నిజాలు తేల్చలేకనే: పీతల, పంచుమర్తి
మాధవ్ డర్టీ వీడియోపై నిజాలు నిగ్గుతేల్చడం కన్నా.. వాస్తవాలు మరుగుపర్చేందుకే జగన్రెడ్డి ప్రయాసపడుతున్నాడని మాజీ మంత్రి పీతల సుజాత, టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. మాధవ్పై చర్యలు తీసుకోవడంపై జగన్కు ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. ‘‘మాధవ్ డర్టీ వీడియో మార్ఫింగ్ అనేవిధంగా మాట్లాడటం సబబా? కోట్లాది మహిళల ఆత్మగౌరవం కన్నా డర్టీ ఎంపీనే జగన్కు ఎక్కువయ్యాడా? మాధవ్ను రక్షించడానికి కులచిచ్చు పెట్టడం రాజకీయ మళ్లింపు కాదా?’’ అని నిలదీశారు.
Updated Date - 2022-08-11T08:21:39+05:30 IST