వైసీపీ నేతలపై కేసులు పెట్టాలి
ABN, First Publish Date - 2022-10-11T09:29:47+05:30
అమరావతి రైతుల మహాపాదయాత్రలో అల్లర్లను ప్రేరేపించేలా, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా దుర్మార్గపు ఆలోచనలతో
పాదయాత్ర వద్ద నిఘా పెంచాలి.. డీజీపీకి హైకోర్టు న్యాయవాది లేఖ
అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల మహాపాదయాత్రలో అల్లర్లను ప్రేరేపించేలా, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా దుర్మార్గపు ఆలోచనలతో ప్రకటనలు చేస్తున్న మంత్రులు, వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి, తక్షణం చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ డీజీపీని కోరారు. హింసను ప్రేరేపించే వారిని నిరోధించేలా స్థానిక పోలీ్సస్టేషన్లకు తగిన ఆదేశాలు ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు సోమవారం డీజీపీకి ఆయన లేఖ రాశారు. హైకోర్టు అనుమతితో రాజధాని రైతులు అమరావతి-అరసవల్లి పాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో అధికార పార్టీ నేతలు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నారన్నారు. మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, గుడివాడ అమరనాథ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేశ్ తదితరులు దుర్మార్గపు ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. శాంతియుతంగా సాగుతున్న పాదయాత్రలో హింసను సృష్టించే ప్రకటనలు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేయాలని కోరారు. రైతుల పాదయాత్ర జరిగే ప్రాంతాల్లో నిఘాను పెంచాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-10-11T09:29:47+05:30 IST