రైతుల పాదయాత్ర చరిత్రాత్మకం
ABN, First Publish Date - 2022-01-24T05:36:46+05:30
అమరావతి రాజధానిని నిలుపుకొనేందుకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రైతులు సాగించిన పాదయాత్ర చరిత్రాత్మకం అని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.
తెలుగు రైతు అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి
యాత్రలో పాల్గొన్న వారి పాదాలకు పాలాభిషేకం
క్రోసూరు, జనవరి23: అమరావతి రాజధానిని నిలుపుకొనేందుకు న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు రైతులు సాగించిన పాదయాత్ర చరిత్రాత్మకం అని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం క్రోసూరు మండలం ఊటుకూరులో రాష్ట్ర తెలుగు మహిళ అధికార ప్రతినిధి వేగుంట రాణి ఆధ్వర్యంలో పాదయాత్రలో పాల్గొన్న రైతులకు పాదాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వక్తలు మాట్లాడుతూ రాజధాని రాష్ట్ర నడిబొడ్డున ఉండాలని, అతిపెద్ద రాజధాని నిర్మాణం జరిగితే అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో రాజధానిని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. ఆనాడు చంద్రబాబునాయుడి నిర్ణయాన్ని హర్షించిన వారు ఆ తర్వాత సంకుచిత స్వభావంతో మూడు ముక్కలాట ఆడటం దారుణమన్నారు. కార్యక్రమానికి రాజధాని సాధన సమితి నాయకులు పువ్వాడ సుధాకర్, బెల్లంకొండ నరసింహారావు, దళిత జేఏసీ నాయకులు పులి చిన్న, నరసరావుపేట పార్లమెంట్ తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి బాష్యం ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సభకు రాష్ట్ర టీడీపీ నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మద్దిరాల గంగాధర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నలజాల సదాశివరావు, కొండవీటి శ్రీనివాసరావు, తోకా వెంకటరావు, నల్లమేకల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-24T05:36:46+05:30 IST