టీడీపీ పాదయాత్ర భగ్నం
ABN, First Publish Date - 2022-02-20T05:19:57+05:30
టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కోడెల శివరాం చేపట్టిన చంద్రన్న ఆశయసాధన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు.
కోడెల శివరాం అరెస్టు
నాయకులు, కార్యకర్తల నిరసన
సత్తెనపల్లి, ఫిబ్రవరి 19: టీడీపీ నియోజకవర్గ నాయకుడు డాక్టర్ కోడెల శివరాం చేపట్టిన చంద్రన్న ఆశయసాధన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. శనివారం పట్టణంలోని ఎన్టీఆర్ భవన్ నుండి రాజుపాలెం మండలం దేవరంపాడు వరకు ఈ పాదయాత్రను చేపట్టాలని టీడీపీ శ్రేణులు ఎన్జీఆర్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకుని డీఎస్పీ విజయభాస్కరరెడ్డి, సీఐ శోభన్బాబు ఆధ్వర్యంలో పోలీసులు ఎన్టీఆర్ కార్యాలయం వద్దకు చేరుకొని టీడీపీ కార్యకర్తలు, నాయకులను బయటకు రానివ్వలేదు. దీంతో పోలీసులకు కోడెల శివరాంకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీసులకు, టీడీపీ నాయకులకు మధ్య తోపులాట, పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీనాయకుల నినాదాలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈసందర్భంగా కోడెల శివరాం మాట్లాడుతూ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఇబ్బందిపెడితే సహించేది లేదని హెచ్చరించారు. పేరేచర్ల నుండి రాజుపాలెం మండలం కొండమోడు వరకు రోడ్డు నిర్మాణాలు చేయాలని కోరుతూ పాదయాత్ర చేపడితే దానినిపోలీసులు అడ్డుకోవటం తగదన్నారు. వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి రాగానే ముందుగా డాక్టర్ కోడెల శివప్రసాద్ను ఎంతో ఇబ్బందిపెట్టారన్నారు. సీఎం చేస్తున్న దారుణాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజలే జగన్ ప్రభుత్వానికి బుద్ది చెప్తారని శివరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా డాక్టర్ కోడెల శివరాం, ఆయన అనుచరులు ఎన్టీఆర్ భవన్కు చేరుకొని ఎన్టీఆర్, డాక్టర్ కోడెల శివప్రసాదరావు విగ్రహాలకు టీడీపీ సీనియర్ నేత పోట్ల సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్భవన్లో పార్టీ నాయకులతో సమావేశమై పాదయాత్రకు సన్నద్ధమవుతున్న తరణంలో పోలీసులు ప్రవేశించి కోడెల శివరాంను ఆతుకూరి నాగేశ్వరరావు, సయ్యద్ పెదకరిముల్లా, మందాడి రవిలను అరెస్ట్చేసి వేరే ప్రాంతానికి తరలించారు.
టీడీపీ శ్రేణుల నిరసన
డాక్టర్ కోడెల శివరాం, తదితర నాయకులను వెంటనే విడుదల చేయాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. శివరాం అరెస్ట్ను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఖండించారు. కార్యక్రమంలో టీడీపీ ముప్పాళ్ల, రాజుపాలెం మండల అధ్యక్షులు నలబోతు పాపారావు, అంచుల నరసింహారావు, నాయకులు మస్తాన్వలి, రాంబోబుడే తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-02-20T05:19:57+05:30 IST