రెవెన్యూలో.. డిప్యూటేషన్ల రద్దు?
ABN, First Publish Date - 2022-03-22T05:42:25+05:30
రెవెన్యూ జిల్లా శాఖలో జరిగిన డిప్యూటేషన్లు అన్ని రద్దు కాబోతున్నాయి. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నది.
రెండున్నరేళ్లుగా జరిగిన వాటిపై చర్యలు
ఫిర్యాదుల పరంపరతో సీసీఎల్ఏ ఆదేశాలు
ఇప్పటికే కడపలో అమలు.. అదేబాటలో కలెక్టర్ వివేక్యాదవ్ సిద్ధం
వైసీపీ నేతలకు రూ.లక్షలు ఇచ్చి పోస్టింగ్లు పొందిన వారిలో ఆందోళన
గుంటూరు, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ జిల్లా శాఖలో జరిగిన డిప్యూటేషన్లు అన్ని రద్దు కాబోతున్నాయి. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నది. అసలు ఏ క్యాడర్లలో డిప్యూటేషన్లు జరిగాయి, ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో ఏ తేదీల్లో ఉత్తర్వులు వెలువడ్డాయనే వివరాలను రెవెన్యూ అధికారులు బయటికి తీస్తోన్నారు. తహసీల్దారు క్యాడర్తో పాటు డీటీ, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, వీఆర్వోల స్థాయిలో ఈ డిప్యూటేషన్లు జరిగాయి. అవన్నీ రద్దు చేసేందుకు ఫైలు సిద్ధమౌతోన్నట్లు రెవెన్యూవర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫోకల్ పాయింట్లలో పోస్టింగ్ల కోసం వైసీపీ నేతలకు రూ.లక్షలు కుమ్మరించి వచ్చిన వారు ఆందోళన చెందుతున్నారు.
నిషేధం ఉన్నా.. సిఫార్సులు
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విడత మాత్రమే ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని నెల పాటు ఎత్తేసింది. ఆ తర్వాత కొవిడ్తో మళ్లీ నిషేధాన్ని ఎత్తివేయలేదు. కాగా వైసీపీ నేతలు మాత్రం అదే పనిగా ఫలానా ఉద్యోగిని బదిలీ చేసి తాము సూచించిన వారికి పోస్టింగ్ ఇవ్వమని రెవెన్యూ అధికారులకు పెద్దసంఖ్యలో సిఫార్సు లేఖలు పంపించారు. వాటి ఆధారంగానే డిప్యూటేషన్లు జరిగాయన్న విషయం బహిరంగ రహస్యమే. ఇందుకోసం తహసీల్దారు పోస్టుకి రూ.5 లక్షలు, డీటీ/ఆర్ఐ వంటి పోస్టులకు రూ.లక్ష, వీఆర్వో పోస్టుకి రూ.50 వేలు సమర్పించుకున్నారు. ఒక్కో తహసీల్దారు ఏడాదిలో నాలుగు మండలాలకు డిప్యూటేషన్పై వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందంటే డిప్యూటేషన్లు ఎంత తారాస్థాయికి వెళ్లాయో ఇట్టే చెప్పొచ్చు. వైసీపీ నేతలు ఒకరిని చూసి ఒకరు పోటాపోటీగా డిప్యూటేషన్లకు సంబంధించి లేఖలు పంపించేవారు. వీటిని వారు ఆదాయవనరుగా పరిగణించారన్న ఆరోపణలు వచ్చాయి. సీసీఎల్ఏకి ఫిర్యాదులు వెళ్లడంతో వాటిపై స్పందించి కలెక్టర్ల నుంచి వివరణలు తీసుకున్నారు. శాంక్షన్ క్యాడర్కు మించి ఉన్న వారిని వెనక్కు పంపేయాలన్న ఉత్తర్వులు దృష్ట్యా ఇప్పటికే కడప జిల్లా కలెక్టర్ అక్కడ జరిగిన డిప్యూటేషన్లను రద్దు చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో డిప్యూటేషన్ల వల్ల ఇబ్బందులు తలెత్తే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో జరిగిన డిప్యూటేషన్లను రద్దు చేసేందుకు కలెక్టర్ వివేక్యాదవ్ కూడా చర్యలు చేపట్టినట్లు రెవెన్యూవర్గాలు చర్చించుకుంటున్నాయి.
Updated Date - 2022-03-22T05:42:25+05:30 IST