రాజధాని ఏదో తెలియకుండా పాలన
ABN, First Publish Date - 2022-01-24T06:10:18+05:30
అమరావతిని నిర్వీర్యం చేసి, రాజధాని ఎక్కడో తెలియకుండా జగన్రెడ్డి పాలన ఉందని రైతులు తెలిపారు.
767వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు
తుళ్లూరు, జనవరి 23: అమరావతిని నిర్వీర్యం చేసి, రాజధాని ఎక్కడో తెలియకుండా జగన్రెడ్డి పాలన ఉందని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి అభివృద్ధిని కొనసాగించాలని రైతులు చేస్తోన్న ఆందోళనలు ఆదివారంతో 767వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ ఏపీ రాజధాని ఏది అని ఇతర రాష్ట్రాల ప్రజలు ఎగతాళి చేసే స్థితికి సీఎం జగన్రెడ్డి తీసుకొచ్చారన్నారు. దాదాపు పది వేల కోట్ల ప్రజాధనంతో అమరావతిలో నిర్మాణ పనులు జరిగితే వాటిని పాడుబెడుతున్నారన్నారు. ప్రజాధనానికి విలువ లేకుండా చేసిన పాలకులు గద్దె దిగి పోవాలన్నారు. విశాఖలో రాజధానితో ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగదని తెలిసి కూడా ప్రజలను పక్కదారి పట్టించడానికి పాలకులు అబద్ధాలు చెపుతూ వస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయనేది జగమెరిగిన సత్యమన్నారు. అమరావతి నిర్వీర్యంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇరవై ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. లేదంటే హైదరాబాద్ కన్నా మిన్నగా అమరావతి నుంచి రాష్ట్రానికి ఆదాయం వచ్చేదన్నారు. ఇప్పటికైనా అమరావతిని రాష్ట్ర ఏకైక రాజధానిగా పేర్కొంటూ అభివృద్ధి పనులను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది.
Updated Date - 2022-01-24T06:10:18+05:30 IST