విడుదలైనా.. వెతలే
ABN, First Publish Date - 2022-06-10T06:00:11+05:30
కాల్వల మరమ్మతులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.. తూటికాడ, వ్యర్థాలతో కాల్వలు పూడిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టా పరిధిలోని కాల్వలను బాగు చేసి సాగునీటిని విడుదల చేయాలని అన్నదాతలు అభ్యర్థిస్తున్నారు.
నేడు కృష్ణా డెల్టాకు నీటి విడుదల
అధికారుల ప్రకటనతో రైతుల్లో కలవరం
కాల్వల పనులు ఎక్కడివక్కడే ఉన్నా నిర్ణయం
పొలాలకు నీటి పారుదల కష్టమేనంటున్న రైతులు
అన్నదాతల అభ్యంతరాలను ఆలకించని అధికారులు
తెనాలి, బాపట్ల, గుంటూరు జూన్ 9 (ఆంధ్రజ్యోతి): కాల్వల మరమ్మతులు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.. తూటికాడ, వ్యర్థాలతో కాల్వలు పూడిపోయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టా పరిధిలోని కాల్వలను బాగు చేసి సాగునీటిని విడుదల చేయాలని అన్నదాతలు అభ్యర్థిస్తున్నారు. అయితే వీరు గోడు పట్టించుకోని ప్రభుత్వం నీటి విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. ప్రభుత్వం ప్రకటించిన ముందస్తు ఖరీఫ్ ప్రణాళికల్లో భాగంగా కృష్ణా డెల్టాకు సాగునీటిని శుక్రవారం విడుదల చేయనుంది. ఈ ప్రకారం డెల్టాలో 2022-23 ఖరీఫ్ కోసం ప్రకాశం బ్యారేజీ నుంచి నీటి విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అధికారుల నిర్ణయంపై రైతులు కలవరపాటుకు గురవుతున్నారు. విడుదల చేసిన సాగు నీరు చివరి భూములకు ఏమో కాని మొదటి భూములకు అందడమే కనా కష్టమని రైతులు అభిప్రాయపడుతున్నారు. నీటి విడుదల తేదీని ఆర్భాటంగా ప్రకటించిన నీటి పారుదలశాఖ పనులకు సంబంధించి నిధులు మంజూరు చేసే విషయంలో కానీ, సకాలంలో పనులు పూర్తి చేసే విషయంలో కానీ శ్రద్ధ చూపలేదన్న విమర్శలు అన్నదాతల నుంచి వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్షాలు పడితే ముంపు సమస్య నెలకొంటుందని రైతులు ఆందోళనచెందుతున్నారు. నీటి విడుదలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు రైతుల నుంచి వస్తున్న అభ్యంతరాలను మాత్రం పట్టించుకోవడం లేదు. కాల్వల్లో నిండిన తూటికాడను తొలగించకుండా నీరు ఇస్తామని ప్రకటించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదలపై ప్రభుత్వ ప్రకటనప్పటి నుంచే రైతులు వివిధ రూపాల్లో తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కాల్వల్లో పనులు చేయకుండా సాగునీరు విడుదల చేస్తే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బాపట్లలో జరిగిన డీఆర్సీ సమావేశంలో సైతం రైతులు ఇదే అంశాన్ని పాలకుల ముందుంచారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. నీటి విడుదల తేదీ అయితే వచ్చిందిగాని పనుల ప్రతిపాదనలు ఇంకా టెండర్ల దశే దాటలేదు. తెనాలి ప్రాంత రైతులు బుధవారం ఇరిగేషన్ ఈఈని కలిసి కాల్వల పనుల మరమ్మతుల విషయంపై వినతిపత్రం కూడా సమర్పించారు. పనులు చేయకుండా నీరు ఇచ్చేస్తే అవి ఎంత వరకు ఉపయోగపడతాయంటూ అధికారులను నిలదీశారు. నీటి విడుదల తర్వాత కాంక్రీటు పనులు గాని షట్టర్ల మరమ్మతులు గాని పూర్తి చేయడం సాధ్యం కాని విషయమే. ఈ తరుణంలో పశ్చిమ డెల్టాకు సాగు నీరు చివరి వరకు చేరడం కూడా ప్రశ్నార్ధకమే.
టెండర్ల గడువు మళ్లీ పెంపు
డ్రెయినేజీ నిర్వహణకు సంబంధించి చీరాల శాఖ గతంలో 28 పనులకు రూ.2.83 కోట్ల అంచనాతో టెండర్లను ఆహ్వానించింది. వీటికి తొలుత జూన్ 6 వరకు గడువు విధించింది. అయితే ప్రస్తుతం మరో వారం రోజులు గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టెండర్లలో గతంలో పేర్కొన్న నిబంధనలు ఇటీవల సంచలనమైన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో టెండర్లు ఖరారయ్యేదెప్పుడో పనులు ఎప్పుడు మొదలవుతాయో అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక పశ్చిమ డెల్టాలోని కాల్వల పనుల కోసం ప్రభుత్వం రూ.3.5 కోట్లు మంజూరు చేసింది. వీటికి సంబంధించి 56 పనులను ఇప్పటికే పూర్తి చేయాల్సి ఉంటే ప్రభుత్వం నుంచి అనుమతులు రావడం, టెండర్ల ప్రక్రియలో జాప్యంతో పనులు ఆలస్యమయ్యాయి. అయితే గుర్రపు డెక్క, పూడికతీత, తూటికాడ తొలగింపు పనులు, కట్టలను సరి చేయడం వంటివి మినహా కాంక్రీటు పనులను ఇంకా మొదలు పెట్టలేదు.
ఇప్పటికి సరే.. తర్వాతేమిటో
ఖరీఫ్ ప్రారంభంలో తొలకరి వర్షాలు కురిసిన వెంటనే వ్యవసాయ పనులు ప్రారంభించడం అనవాయితి. అయితే ఈసారి వర్షాలు పెద్దగా లేకపోవడం, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వ్యవసాయ పనులు మండకొడిగానే సాగుతున్నాయి. కృష్ణా పశ్చిమ డెల్టాలో గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు కలిపి 5 లక్షల 71 వేల 351 ఎకరాల్లో ఏటా వరి సాగు అవుతుంది. దీనిలో గుంటూరు జిల్లా కింద లక్షా 84 వేల 190 ఎకరాలు, బాపట్ల జిల్లా కింద 3 లక్షల 79 వేల 997 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో మరో 7164 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఒక ఖరీఫ్ సీజన్ పూర్తవడానికి 69 టీఎంసీల నీరు అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం నీటిని విడుదల చేసినా వాటిని సద్వినియోగం చేసుకోవడం కష్టమే. పశ్చిమ డెల్టాలో రెండు లక్షల ఎకరాల వరకు రైతుల వెద సాగుకు ప్రాథాన్యం ఇస్తూ అధికారులు నీటి విడుదలకు నిర్ణయించారు. జూలై వరకు నారుమళ్లకు ఏ ఇబ్బంది లేకుండా నీరు ఇవ్వగలమంటున్నారు. అయితే ఆ తర్వాత జూలైలో విస్తారంగా వర్షాలు కురిస్తే కానీ సాగు గట్టెక్కే పరిస్థితి లేదు. ఈ తరుణంలో ఉన్న నీటిని విడుదల చేసి తర్వాత వర్షాలే దిక్కని చేతులు ఎత్తేస్తారా అంటూ రైతు సంఘాలు మండిపడుతున్నాయి. పులిచింతలలో ఉన్న మొత్తం నీటిని సాగుకు మళ్లించుకునే కంటే మూలన పెట్టిన పట్టిసీమను సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు సాగు కష్టాలు తీరతాయని రైతు సంఘాల వాదన. ప్రస్తుతం పులిచింతలలో 30 టీఎంసీలకు పైగా నిల్వ ఉన్న నీటిని నారుమడులకు, నాట్లకు వదలడానికి విడుదల చేస్తామని అధికారులు అంటున్నారు. ఈ లోపు వర్షాలు కురిస్తే పులిచింతల నుంచి నీటి విడుదలకు డిమాండ్ ఉండదని ఈ ఏడాది సాధారణ వర్షపాతం ఉంటుందని, ఈ దృష్ట్యా ఖరీఫ్లో సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తామని జలనవరుల శాఖ అధికారవర్గాలు చెబుతోన్నాయి. వర్షాలు లేకపోవడం ఎగువ బ్యారేజీల్లో కూడా నీటి నిల్వ సామర్థ్య స్థాయి కంటే తక్కువగానే ఉండటం కొంత ఆందోళన కలిగిస్తున్నది.
ముహూర్తం ఇలా..
శుక్రవారం ఉదయం 11.42 గంటలకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ రెగ్యులేటర్ స్విచ్ నొక్కి నీటిని విడుదల చేస్తారు. తొలి రోజు కేవలం 400 క్యూసెక్కులు మాత్రమే విడుదల ఉంటుందని, అవసరానికి అనుగుణంగా సామర్థ్యాన్ని పెంచుకుంటూ వెళతామని కృష్ణా పశ్చిమ విభాగం ఈఈ వెంకటరత్నం చెప్పారు. నారుమళ్లకు అవసరమైన వెయ్యి క్యూసెక్కుల నీటిని బ్యారేజీ నుంచి తీసుకుంటామన్నారు. రైతులు ముందస్తు ఖరీఫ్ సాగుని చేపట్టాలని కోరారు. నవంబరు, డిసెంబరు నెలల్లో ప్రకృతి విపత్తులు సంభవించే నాటికే పంట చేతికొచ్చి రైతులకు నష్టం కలగకుండా ఉంటుందని సూచించారు.
Updated Date - 2022-06-10T06:00:11+05:30 IST