స్కూల్లో ఆక్రమణల తొలగింపునకు కొవిడ్ అడ్డమా?
ABN, First Publish Date - 2022-12-30T04:02:38+05:30
కొవిడ్ సమయంలో స్థానిక ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించగలిగిన అధికారులు...
మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిపారు?
సీఎం అదనపు కార్యదర్శిని ప్రశ్నించిన హైకోర్టు
పేదలు చదివే ప్రభుత్వ స్కూళ్లు బాగుండాలి
అందువల్లే ఆక్రమణలను తొలగించమన్నాం
ఆ ఆదేశాల అమలులోనూ జాప్యం చేస్తారా?
చర్యల రికార్డులను కోర్టు ముందు ఉంచండి
కలెక్టరు, తహసిల్దార్కు హైకోర్టు ఆదేశాలు
హాజరునుంచి మినహాయింపునకు నిరాకరణ
అమరావతి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): కొవిడ్ సమయంలో స్థానిక ఎన్నికలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించగలిగిన అధికారులు... స్కూలు ఆవరణలో ఆక్రమణలు తొలగించాలంటూ ఇచ్చిన ఆదేశాలను మాత్రం అమలుచేయలేకపోయారా? అని హైకోర్టు ప్రశ్నించింది. కొవిడ్ కారణంగా ఉత్తర్వుల అమలులో జాప్యం జరిగిందన్న అప్పటి పశ్చిమగోదావరిజిల్లా కలెక్టర్, సీఎం అదనపు కార్యదర్శి రేవు ముత్యాలరాజు తరఫు ప్రభుత్వ న్యాయవాది శుభాష్ వివరణను తీవ్రంగా తప్పుబట్టింది. ఏమి చర్యలు తీసుకున్నారో సంబంధిత రికార్డులను న్యాయస్థానం ముందు ఉంచాలని కలెక్టర్, నిడదవోలు మండలం తహసిల్దార్ను ఆదేశించిం ది. తదుపరి విచారణకు సైతం హాజరుకావాల్సిందేనని అధికారులకు స్పష్టం చేసింది. హాజరు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు నిరాకరించింది. విచారణను జనవరి 20కి వాయిదా వేసింది. ఈ మేరకు హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఆదేశాలిచ్చారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, నిడదవోలు మండలం, సమిశ్ర గూడెం పంచాయితీ పరిధిలో నిరుపయోగంగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలను ఆక్రమించుకొని వేడుకల నిర్వహణకు వినియోగిస్తున్నారని, ఆక్రమణలు తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ షేక్ సిలార్ అనే వ్యక్తితోపాటు మరొకరు 2020లో హైకోర్టును ఆశ్రయించారు. సర్వే నిర్వహించి పాఠశాల స్థలంలో ఆక్రమణలు ఉంటే తొలగించి ప్రహరీ నిర్మించాలని అదే ఏడాది నవంబరు 3న సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు.
కోర్టు తీర్పు అమలుకాకపోవడంతో పిటిషనర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. పంచాయతీరాజ్శాఖ ముఖ్యకార్యదర్శి, అప్పటి పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ముత్యాలరాజు, తహసిల్దార్ శాస్త్రి తదితరులను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి.. పాఠశాల భవనాల్లో ఆక్రమణలు తొలగించే విషయంలో కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే విస్మరించారని ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. కోర్టుధిక్కరణ చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో వివరణ ఇవ్వాలని ముత్యాలరాజు, పంచాయతీరాజ్శాఖ సబ్ డివిజనల్ ఇంజనీర్ ఎం.గంగరాజు తదితరులకు ఫామ్-1 నోటీసు జారీచేశారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా.. అధికారులు హాజరయ్యారు. విచారణ సందర్భంగా ముత్యాలరాజు తరఫున ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపించారు. ‘‘కొవిడ్ కారణంగా కోర్టు ఉత్తర్వులను సకాలంలో అమలు చేయలేకపోయాం. జాప్యం జరిగినందుకు క్షమాపణ చెబుతున్నాం.
సర్వే చేసి ఆక్రమణలు తొలగించాం’’ అని తెలిపారు. ఈ వాదనలను న్యాయమూర్తి తప్పుబట్టారు. ‘‘పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణం ఉండాలి. ఈ ఉద్దేశంతోనే ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలు ఇచ్చాం. ఆదేశాలు అమలు చేయకపోతే ఎలా? బ్యూరోక్రాట్లు పెద్దపెద్ద పాఠశాలల్లో చదివి ఉంటారు. అందువల్లే ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవడం లేదు’’ అని ఆగ్రహించారు. తదుపరి విచారణ నుంచి హాజరు మినహాయింపు ఇవ్వాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చారు. విచారణను వాయిదా వేశారు.
‘‘పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలల్లో సరైన వాతావరణం ఉండాలి. ఈ ఉద్దేశంతోనే ఆక్రమణల తొలగింపునకు ఆదేశాలు ఇచ్చాం. అలాంటి ఆదేశాలూ అమలుచేయకపోతే ఎలా? బ్యూరోక్రాట్లు పెద్దపెద్ద పాఠశాలల్లో చదివి ఉంటారు. అందువల్లే ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవడం లేదు’’
- హైకోర్టు వ్యాఖ్యలు
Updated Date - 2022-12-30T04:02:39+05:30 IST