అరవింద్బాబుపై దాడి హేయం
ABN, First Publish Date - 2022-01-17T05:03:15+05:30
పల్నాడు ప్రాంతంలో అశాంతిని నెలకొల్పేందుకు టీడీపీపై దాడులకు తలపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే,సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్
పొన్నూరుటౌన్, జనవరి16: పల్నాడు ప్రాంతంలో అశాంతిని నెలకొల్పేందుకు టీడీపీపై దాడులకు తలపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే,సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ఆదివారం ఓ ప్రకటనలో ఆరోపించారు. నరసరావుపేట టీడీపీ ఇన్చార్జి చదలవాడ అరవిందబాబుపై పోలీసులు, వైసీపీ నేతలు దౌర్జన్యం చేయడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్న తీరు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులను, పోలీసు వ్యవస్థ పనితనాన్ని తెలియజేస్తుందన్నారు. అరవింద్బాబు, టీడీపీ శ్రేణులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దాడికి పాల్పడిన వైసీపీ శ్రేణులు అందుకు సహకరించిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడులతో టీడీపీ కేడర్ను భయపెట్టాలనే పిచ్చి ఆలోచనలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. వైసీపీ కార్యకర్తల అడుగులకు మడుగులొత్తుతున్న పోలీసులు తగిన మూల్యం చెల్లించే కాలం దగ్గరలోనే ఉందని నరేంద్రకుమార్ హెచ్చరించారు.
Updated Date - 2022-01-17T05:03:15+05:30 IST