ఆవేశంలో నిర్ణయాలతో అనర్థం
ABN, First Publish Date - 2022-10-14T05:41:13+05:30
కుటుంబాల్లో ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సరైనవికావని, వీటివల్ల అనర్థాలు తలెత్తే ప్రమాదం ఉందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
త్వరలో చీరాలలోనూ ఫ్యామిలీ కౌన్సిలింగ్
బాపట్ల సెంటర్ ప్రారంభోత్సవంలో ఎస్పీ జిందాల్
బాపట్ల, అక్టోబరు 13: కుటుంబాల్లో ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సరైనవికావని, వీటివల్ల అనర్థాలు తలెత్తే ప్రమాదం ఉందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కుటుంబ కలహాల పరిష్కారం కోసం బాపట్ల పట్టణ పోలీసుస్టేషన్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కుటుంబ వ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయన్నారు. ఆయా సమస్యల రాజీ కోసం ఫ్యామిలీ కౌన్సిలింగ్
సెంటర్లు ఉపయోగపడతాయన్నారు. త్వరలో చీరాల సబ్ డివిజన్ పరిధిలో కూడా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దంపతులు పంతాలు వీడి ప్రశాంత వాతావరణంలో మెలగాలన్నారు. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు సరైనవికావని తెలియజెప్పేందుకు ఫ్యామిలి కౌన్సిలింగ్ సెంటర్ పనిచేస్తుందన్నారు. ఈ కేంద్రంలో ఇద్దరు న్యాయసలహదారులు, చట్టాలపై అవగాహన కలిగిన విశ్రాంత పోలీసు అధికారి, వైద్యాధికారి, పోలీసు అధికారి అందుబాటులో ఉంటారన్నారు.
అలసత్వం వహిస్తే సహించేదిలేదు
విధినిర్వాహణలో ఆలసత్వం వహిస్తే సహించేదిలేదని, పనితీరు మెరుగు పర్చుకోకుంటే చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. పట్టణ పోలీసుస్టేషన్లో ఆయన వార్షిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సచివాలయ మహిళా పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదకద్రవ్యాల రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాలని చెప్పారు. రౌడీషీటర్ల కదలికలపై ఆరా తీయాలన్నారు. బీట్ వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నారు. అనంతరం పోలీసుస్టేషన్లోని వివిధ నేరాలకు సంబంధించిన రికార్డులను, సీడీఫైల్స్ను పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని స్టేషన్ సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమాల్లో ఏఎస్పీ పి.మహేష్, డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు, సీఐ పి.కృష్ణయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఎ.శ్రీనివాస్, ఏరియా హాస్పటల్ వైద్యులు డాక్టర్ ఎ.రత్నాంజలి, న్యాయవాదులు వై.ఉషారాణి, కె.అవినాష్, విశ్రాంత పోలీసు అధికారి సి.హెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-10-14T05:41:13+05:30 IST