Gadde rammohan: విజయవాడలో గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన
ABN, First Publish Date - 2022-09-01T20:48:23+05:30
రేషన్ బియ్యం అక్రమ రవాణాను నివారించాలంటూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
అమరావతి: రేషన్ బియ్యం అక్రమ రవాణాను నివారించాలంటూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ (Gadde rammohan) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ లోని రేషన్ దుకాణం నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకూ తెలుగుదేశం శ్రేణుల (TDP Leaders) నిరసన ర్యాలీ చేశారు. ఆపై స్థానిక తహసీల్దార్కు గద్దె రామ్మోహన్ (MLA) వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యంలో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతూ రూ.7 వేలకోట్ల అవినీతి చేశారని మండిపడ్డారు. రేషన్ బియ్యాన్ని విదేశాలకు అక్రమంగా తరలించి బ్లాక్ మార్కెటింగ్ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
పేదల రేషన్ బియ్యాన్ని నాటు సారా తయారీ కోసం వినియోగిస్తున్నారన్నారు. పేదల పొట్టగొడుతున్న వైసీపీ నేతల తీరుకు నిరసనగానే ఆందోళన చేపట్టామని తెలిపారు. సబ్సీడీపై నిత్యావసర సరుకులు లభించే రేషన్ దుకాణం వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఇచ్చే బియ్యాన్ని కూడా వైసీపీ నేతలు బ్లాక్ మార్కెటింగ్కు తరలించారనటానికి ఎన్నో ఉదాహరణలున్నాయని తెలిపారు. ఏపీ ఇసుక మన రాష్ట్రంలో తప్ప అన్ని ప్రాంతాల్లోనూ లభిస్తోందని గద్దె రామ్మోహన్ అన్నారు.
Updated Date - 2022-09-01T20:48:23+05:30 IST