సీటుంటుందా
ABN, First Publish Date - 2022-08-25T06:49:38+05:30
అధికార వైసీపీలో ఎమ్మెల్యేలకు సీటు భయం వెన్నాడుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందో లేదోననే బెంగ భయపెడుతోంది. ఒకపక్క సీఎం జగన్ తన ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలపై నెట్టేసి గ్రాఫ్ పెంచుకోవాలని పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో గ్రాఫ్ పెరగడం లేదు. ఈ నేప థ్యంలో తాజాగా నిర్వహించిన అంతర్గత సర్వేలో జిల్లానుంచి ముగ్గురు సిట్టింగ్ల కు టిక్కెట్లు కష్టమేనని తేలింది.
- -జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల్లో సర్వే గుబులు
- -ముగ్గురు సిట్టింగ్లకు వచ్చే ఎన్నికల్లో సీటు రావడం కష్టమేనని చర్చ
- -పార్టీ,పీకే సర్వేలో కాకినాడరూరల్,పిఠాపురం,ప్రత్తిపాడు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత
- -ఈముగ్గురు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకతతోపాటు గ్రాఫ్ బాగోలేదని నివేదికలు
- -వీరిని మార్చాలంటూ అధినేతకు అందిన రిపోర్టులు: అధిష్ఠానం నిర్ణయంపై నేతల్లో గుబులు
- -మరోపక్క ప్రత్యామ్నాయం కింద ప్రత్తిపాడులో వరుపులకు పార్టీ స్వేచ్చ
- -పిఠాపురం సీటు ఓ ఉద్యమనేతకు ఇస్తారంటూ తీవ్రంగా ప్రచారం
- -కాకినాడరూరల్ను మార్చితే ఓ అమాత్యుడికి ఇస్తారంటూ విశ్లేషణలు
- -మరోపక్క మిగిలిన ఎమ్మెల్యేలకు సర్వే భయం: తమ పరిస్థితి ఏంటోనని ఆరా
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
అధికార వైసీపీలో ఎమ్మెల్యేలకు సీటు భయం వెన్నాడుతోంది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ దక్కుతుందో లేదోననే బెంగ భయపెడుతోంది. ఒకపక్క సీఎం జగన్ తన ప్రభుత్వంపై వస్తున్న వ్యతిరేకతను ఎమ్మెల్యేలపై నెట్టేసి గ్రాఫ్ పెంచుకోవాలని పదేపదే హెచ్చరిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో గ్రాఫ్ పెరగడం లేదు. ఈ నేప థ్యంలో తాజాగా నిర్వహించిన అంతర్గత సర్వేలో జిల్లానుంచి ముగ్గురు సిట్టింగ్ల కు టిక్కెట్లు కష్టమేనని తేలింది. పార్టీ, పీకే టీం వేర్వేరుగా నిర్వహించిన సర్వేలో కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేక ఫలితాలు తేలాయి. ఈ మేరకు నివేదికలు అధినేత వద్దకు చేరాయి. ఈ నేప థ్యంలో జగన్ ఏనిర్ణయం తీసుకుంటారోనని ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోంది. వ చ్చే దఫా టిక్కెట్ తమకే ఇస్తారా.. లేదా ఉద్వాసన పలుకుతారా అనేది తెలియక వీరంతా తలపట్టుకుంటున్నారు. మరోపక్క ఈ మూడుస్థానాల్లో సీటు కోసం ప్రత్యామ్నాయ నేతలను అధిష్ఠానం పరిశీలిస్తోందని చర్చ జరుగుతోంది.
ప్చ్..ఏం చేయాలి..
వైసీపీ మూడున్నరేళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా పేరుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వంపై జనం ఎక్కడికక్కడ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనపై పెరిగిపోతున్న అప్రతిష్ఠను అధినేత జగన్ ఎమ్మెల్యేలపై నెట్టేసి గ్రాఫ్ల పేరుతో సీటుకు ఎగనామం పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. అందుకోసం ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో పనితీరుపై అంచనా వేసి వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వడమా? లేదా? అనేదానిపై అంచనాకు వస్తున్నారు. తద్వారా వ్యతిరేకత తీవ్రంగా ఉన్న వారిని తప్పించి వేరొకరికి టిక్కెట్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. అందులో భాగంగా జిల్లాలో కొన్నిరోజుల కిందట పార్టీ కోసం పీకే బృందం సర్వే నిర్వహించింది. పార్టీ తరఫున కూడా మరో సర్వే జరిగింది. ఈ రెండింటిలోను జిల్లాలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు వెల్లడైంది. వీరి పనితీరు గ్రాఫ్ కూడా ఏం బాగోలేదని నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో కొందరు ఎమ్మెల్యేలను తప్పించి టిక్కెట్లు వేరొకరికి ఇవ్వాలని జగన్ ఓ నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నివేదిక వివరాలు అధినేత జగన్ వద్దకు చేరాయని, అందులోభాగంగా కాకినాడ రూరల్, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై వ్యతిరేకత తీవ్రంగా ఉన్నట్లు తేలిందని పార్టీ వర్గాలు విశ్లేషించాయి. దీంతో వీరి భవితవ్యం ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. నివేదికల ఆధారంగా వీరిలో ముగ్గురిని పక్కన పెడతారా? లేదా ఒకరిద్దరికి మినహాయింపులు ఇస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది. గ్రాఫ్ బాగోకపోతే ఎంతటి నాయకుడినైనా తప్పిస్తానని ఇదివరకే అధినేత హెచ్చరించిన నేపథ్యంలో ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రస్తుతం కంటిపై కునుకు లేకుండా పోయింది. ఉంచుతారా.. ఉద్వాసన పలుకుతారా? అనేది అర్థం కాక తలపట్టుకుంటున్నారు. వాస్తవానికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే వ్యవహారశైలిపై పార్టీ నేతల్లోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాదని సొంతపార్టీ క్యాడరే ఎప్పటినుంచో తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. అనారోగ్యంతో పెద్దగా బయట తిరగడం లేదు. కాకినాడ రూరల్లో మంత్రి కన్నబాబుకు అమాత్య పదవి ఉన్నప్పుడు, పోయిన తర్వాత క్యాడర్ను పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కుటుంబసభ్యుల ప్రమేయం అన్నింట్లోను పెరిగిపోయిందని క్యాడర్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మరోపక్క బయట పడకపోయినా మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేల్లోను గుబులు రేగుతోంది. తమ పరిస్థితి ఏంటో అర్థంకాక వీరు తమ గాడ్ఫాదర్లకు ఫోన్లు చేసి సర్వే నివేదికల గురించి ఆరాతీస్తున్నారు. ముఖ్యంగా జగ్గంపేట ఎమ్మెల్యే, పెద్దాపురం ఇన్ఛార్జి పనితీరుపై వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో తమ జాతకంపైనా వీళ్లు ఆందోళనతో ఉన్నారు.
ఎవరి ప్రయత్నాలు వారివి..
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పలువురు నేతలు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోపక్కపార్టీ సర్వేలో వ్యతి రేకత అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ ఇన్ఛార్జులు, నేతల ను వైసీపీ ప్రోత్సహిస్తోంది. అం దులోభాగంగా కాకినాడ రూ రల్, ప్రత్తిపాడు, పిఠాపు రం స్థానాల్లో సిట్టింగ్ల ను మార్చితే ఎవరికి ఛాన్స్ ఉంటుందనే దానిపై పార్టీలో రకరకాల ప్రచారం సాగుతోంది. ప్ర త్తిపాడులో ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ కు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయంగా ఇ ప్పటికే వరుపుల సుబ్బారావుకు అధి ష్ఠానం స్వేచ్ఛ ఇచ్చింది. పార్టీ పెద్దలు ఎప్పటికప్పుడు ఆయనకు సూచనలు అందిస్తూ పార్టీ క్యాడర్లో విస్తృతంగా తిరగాలని ఆదేశించింది. దీంతో పర్వత ను తప్పించి సుబ్బారావుకు ఛాన్స్ ఇస్తార ని పార్టీలో చర్చ జరుగుతోంది. కాకినాడ రూరల్ నుంచి కన్నబాబుకు అధినేత జగ న్ మళ్లీ సీటు ఇవ్వడంపై సర్వే నివేదికలు వ్యతిరేకంగా స్పందించిన నేపథ్యంలో ప్రస్తుత మంత్రి వేణు ఈస్థానం నుంచి పోటీ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం సీటు వచ్చే ఎన్నికల్లో బోస్ తనయుడికి ఇస్తారని చర్చ జరుగుతోంది. గతంలో వేణు ఇక్కడి నుంచి పోటీ చేసిన విషయాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. పైగా ఎమ్మెల్యే ద్వారంపూడికి మంత్రి వేణుతో ఉన్న సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో కన్నబాబుకు వ్యతిరేకంగా ఇక్కడికి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పిఠాపురంనుంచి దొరబాబును తప్పిస్తే ఆ స్థానంలో ఓ ఉద్యమ నేతను బరిలో దించుతారని తెలుస్తోంది. ఆయన్ను ఇప్పటికే వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు పలు దఫాలుగా కలిసి ఈ విషయంపై చర్చించినట్లు పార్టీ వర్గాలు వివరించాయి. ఆయన కూడా సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. చివరి నిమిషంలో అధినేత జగన్ సర్వే నివేదికల ఆధారంగా కఠినంగా వ్యవహరిస్తారా? మరో ఛాన్స్తో సరిపెడతారా? అనేది తేలాల్సి ఉంది.
Updated Date - 2022-08-25T06:49:38+05:30 IST