ప్రత్తిపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ABN, First Publish Date - 2022-03-23T06:53:17+05:30
ప్రత్తిపాడు గోవిందపురం కొండ జంక్షన్ సంతోషి మాత ఆలయ సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై మంగళ వారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.
మోటార్ బైక్ను ఢీ కొన్న ఐషర్వ్యాన్
ఇద్దరు మహిళలతో సహా ముగ్గురి దుర్మరణం
ఆధార్ లింకేజీ కోసం బ్యాంకుకు వెళ్లి, తిరిగి వెళుతుండగా ఘటన
ఒమ్మంగిలో విషాదఛాయలు
ప్రత్తిపాడు, మార్చి22: ప్రత్తిపాడు గోవిందపురం కొండ జంక్షన్ సంతోషి మాత ఆలయ సమీపంలో 16వ నెంబరు జాతీయ రహదారిపై మంగళ వారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు. పోలీసులు, స్థానికుల సమాచా రం ప్రకారం.. మండలంలోని ఒమ్మంగికి చెందిన షేక్ అమీన్ సాహెబ్ (29), కొప్పన గనిలక్ష్మి(28), ఉప్పాడ పుష్ప(26) మోటార్బైక్పై కిర్లంపూడి మండలం సోమారం గ్రామంలోని బ్యాంకు పనిపై వెళ్లారు. బ్యాంకులో పని ముగించుకుని తిరిగి మోటార్ బైక్పై ఒమ్మంగి వస్తుండగా ప్రత్తిపాడు గ్రామంలోకి వచ్చేందుకు వారు మోటార్ బైక్ను సంతోషిమాత ఆలయ జం క్షన్ దాటేందుకు రోడ్డుకు అడ్డంగా రావడంతో రాజమహేంద్రవరం నుంచి అన్నవరం వైపు వెళుతున్న హర్యానా ఐషర్ వ్యాన్ వేగంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను వ్యాన్ ఊడ్చుకుని పోవడంతో రహదారి రక్తసిక్తంగా మారింది. వీరు ప్రయా ణించిన మోటార్ బైక్ నుజ్జునుజ్జు అయింది. సంఘటనా స్థలాన్ని అడిషన ల్ ఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు, సీఐ కె.కిశోర్బాబు, ఎస్ఐ కె.సుధాకర్లు పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రత్తిపాడు ప్రభుత్వాసుప త్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాలనీల్లో..కన్నీరుమున్నీరు
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురూ ఒమ్మంగిలో గ్రామ పంచాయతీ వెనుక ఉన్న ఎస్సీ కాలనీ, పద్మకాలనీలు శోక సంద్రంలో మునిగిపోయాయి. వీరిలో షేక్ అమీన్సాహెబ్కు తండ్రి లేకపోవడంతో తల్లి, సోదరి అతనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. తమ కుటుంబానికి అన్ని తానై చూసుకునే అమీన్సాహెబ్ మృతితో అతని తల్లి, సోదరి కన్నీరుమున్నీరవుతున్నారు. ఎస్సీ కాలనీకి చెందిన కొప్పన గనిలక్ష్మికి ఐదేళ్లలోపు పాప, బాబు ఉన్నారు. వ్యవసాయ కూలి పనులు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చే గనిలక్ష్మి మృతి చెందడంతో ఆమె పిల్లలు దిక్కులేని వారయ్యారు. అమీన్సాహెబ్, గనిలక్ష్మిలకు బ్యాంకు ఖాతా ఆధార్ లింకు కోసం కిర్లంపూడి మండలం సోమారం వెళుతూ ఉప్పాడ పుష్పను కూడా తోడుగా తీసుకెళ్లారు. గనిలక్ష్మి, పుష్పలు స్నేహితురాళ్లు కావడంతో పుష్ప వారికి తోడుగా వెళ్లి మృత్యువాత పడింది. వ్యవసాయ కూలి పనులు చేసుకుని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండే పుష్పకు తల్లిదండ్రులతో పాటు తమ్ముడు కూడా ఉన్నాడు. వీరంతా వ్యవసాయ కూలీలు కావడంతో వీరి మరణం ఆయా కుటుంబాలను దిక్కులేనివారిగా మార్చింది.
హైవేపై అప్రమత్తత అవసరం : అడిషనల్ ఎస్పీ
16వ నెంబరు జాతీయ రహదారిపై వాహనదారులు, ప్రయాణికులు చాలా అప్రమత్తతతో ఉండాలని జిల్లా అడిషనల్ ఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ జాతీయ రహదారి అభివృద్ధి చెందడం, వాహనదారులు వేగంతో ప్రయాణించడం వంటి కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. జంక్షన్ల వద్ద రోడ్డు దాటే వాహనదారులు వచ్చీపోయే వాహనాలను గమనించాకే వెళ్లాలన్నారు. ఆయనతోపాటు సీఐ కిశోర్ బాబు, ఎస్ఐ కె.సుధాకర్ ఉన్నారు.
Updated Date - 2022-03-23T06:53:17+05:30 IST