గోతుల వెనుక ఎవరు?
ABN, First Publish Date - 2022-06-12T06:00:58+05:30
క్వారీ.. లారీలకు లారీలు తరలిపోయింది.. సుమారు 160 ఎకరాలు గోతులమయంగా మారిపోయింది..
క్వారీ గోతులు.. ఎవరికి గోరీలు
క్వారీ గోతుల నీటిలోతు 100 అడుగులు
మొత్తం గొయ్యిలోతు 150 అడుగులపైనే
కంకర తవ్వేసి..గోతులు వదిలేసిన లీజుదారులు
సమస్యపై చర్చించిన కలెక్టర్ మాధవీలత
నోటీసులు ఇవ్వనున్న అధికారులు
క్వారీ.. లారీలకు లారీలు తరలిపోయింది.. సుమారు 160 ఎకరాలు గోతులమయంగా మారిపోయింది.. ఒకటీ రెండు అడుగులా ఏకంగా 150 అడుగులు తవ్వేసి క్వారీ తరలించేశారు.. ఆ గోతులను అలాగే వదిలేశారు.. చాలా మంది ఈ గోతుల్లో పడి ప్రమాదాల బారిన పడ్డారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం కావడంతో ఈ విషయం కలెక్టర్కు తెలిసింది.. ఆ గోతులను వెంటనే పూడ్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు సర్వే చేయిస్తున్నారు.. ఆ గోతుల వెనుక ఎవరున్నారనే దానిని తిరగదోడుతున్నారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. భూ యజమానులకు నోటీసులు ఇవ్వనున్నారు. అదే జరిగితే యజమానులు ఆస్తులు అమ్ముకోవాల్సిందే.. ఎప్పుడో చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే..
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ పరిసరాల్లోని క్వారీ గోతులు భూయజమానులకు గోరీ కట్టనున్నాయా? వారిమెడకు ఉచ్చు కాబోతున్నాయా? అవుననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ఇక్కడ క్వారీ భూముల యజమానుల వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో నోటీసులు ఇవ్వనున్నారు. ఎందుకంటే ఇటీవల కలెక్టర్ మాఽధవీలత గోతులు పూడ్చడానికి, వాటి చుట్టు ప్రహరీ కట్టడానికి క్వారీ లీజుదారులతో చర్చించారు. క్వారీ గోతులు పూడ్చడం ఎలా అని ఆలోచించిన అధికారులు ముందుగా డ్రోన్తో సర్వే చేసి, తర్వాత ఎవరు ఈ గోతులు పూడ్చాలో నిర్ణయించాలను కున్నారు. డ్రోన్తో ఫొటోలు మాత్రం తీశారు. వాటితో ఈ గోతుల లోతు తెలియదనే కారణంతో ఎలక్ర్టోకండక్ట్ మెథడ్తో గోతుల్లో నీటిలోతు ఎంత ఉందో కనుగొన్నారు.
ఇప్పుడు ఎవరు బాధ్యులు?
ఇక్కడ మొత్తం 160 ఎకరాల భూమి వరకూ గోతులుగా మారి ఉంది. చాలా కాలం కిందట భూ యజమానులుగా ఉన్న పేదలు వీటిని లీజుకు ఇచ్చారు. లీజుకు తీసుకున్న వ్యక్తులు కొందరు భూములను సొంత చేసుకోగా, కొందరు తెలివిగా అసలు భూ యజమానుల పేరిటే ఉంచి కేవలం లీజుకు తీసుకుని, నల్లకంకర మెటల్ తవ్వుకుని రూ.కోట్లు గడించారు. 2013 నాటికే ఇక్కడ క్వారీలన్నీ గోతుల్లా మిగిల్చి తమ లీజు కాలం ముగిసిందని చెప్పి చేతులు దులుపేసుకున్నారు. గతం లో ఈ గోతుల గురించి ఆందోళనలు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులూ పట్టించుకోలేదు. రాజమహేంద్రవరం జిల్లా కేంద్రం కావడంతో పాటు ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. ప్రమాదకరంగా మారిన గోతుల చుట్టూ ప్రహరీగోడలు కట్టి తర్వాత వీటిని పూడ్చి వినియోగంలోకి తెస్తే బావుంటుందనే ఆలోచన చేసినట్టు సమాచారం. ఈ మేరకు మైన్స్ అధికారులతో సర్వే పెట్టించారు. సుమారు 40 శాతం వరకూ సర్వే పూర్తయింది.ఇంతలో మైన్స్ అధికారులు అసలు ఈ భూము లు ఎవరి వనే వివరాలు ఇవ్వాల్సిందిగా తహశీల్దార్కు లేఖలు రాశారు. రెవెన్యూ అధికారులు రికార్డులు తిరగేస్తున్నారు. ఈ క్వారీ భూయజమానుల వివరాలు ఆరా తీస్తున్నారు.ఎందుకంటే ఇక్కడ లీజుకు తీసుకున్న వ్యక్తులు కంకర తవ్వుకుని వెళ్లిపోయారు. కొందరు లీజు దారులే భూ యజమానులుగా ఉన్నారు. ఎవరైతే భూ యజమానులు ఉన్నారు వారికి నోటీసులు అంద జేస్తారు.ఈ మేరకు వారు సమా ధానం చెప్పాల్సి ఉం టుంది.అయితే వీరిలో చాలా మంది పేదలు ఉంటారనేది పలువురి వాదన.
ఒక్కో గొయ్యి 150 అడుగులు..
ఒక నిపుణుడి సహకారంతో పడవ మీద నుంచి ఎలక్ర్టో కండక్ట్ మెథడ్లో నీరు ఎంత లోతులో ఉందో తెలుసుకున్నారు. గోతుల్లో నీరు 20 అడుగుల నుంచి 100 అడుగుల వరకూ ఉంది. ఇది కేవలం గోతిలో నీటిలోతు మాత్రమే. భూభాగం నుంచి మొత్తం గోతుల లోతులు చూడాలంటే 150 అడుగులపైనే ఉంటుంది. గతంలో అనేక మంది ఈ గోతుల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. పశువులు కూడా పడిపోయాయి. ఈ గోతులను పూడ్చడం ద్వారా భూమిని వినియోగంలోకి తేవాలనేది ఉన్నతాధికారుల లక్ష్యం. ఈ గోతులను పూడ్చడం మామూలు విషయం కాదు.
భూ యజమానులకు నోటీసులు?
త్వరలో భూజమానులకు నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. రెవెన్యూ అధికారులు భూయజమానుల వివరాలు ఇచ్చిన వెంటనే మైన్స్ అధికారులు నోటీసులు జారీ చేస్తారు. గోతులు మీరే పూడ్చాలని చెప్పనున్నారు. దీంతో భూయజమానుల్లో ఆందోళన మొదలైంది. వాస్తవానికి లీజు ఇచ్చేటప్పుడే క్వారీ తవ్వేసిన తర్వాత మళ్లీ వేరేదానితో గోతులు పూడ్చాలని నిబంధన ఉంటుంది. పైగా 150 అడుగుల లోతు తవ్వడానికి ఎవరూ అనుమతివ్వరు.ప్రస్తుతం లీజుదారులు తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు. భూయజమానులకు గోతులు పూడ్చే పని పడనుంది. భూ యజమానుల వద్ద ఏమైనా ఆధారాలుంటే లీజుదారులు తప్పించుకోలేరు. త్వరలో క్వారీ గోతుల సర్వే పూర్తయ్యాక, అఽధికారులు సమస్యను ఎలా పరిష్కరిస్తారోమరి.
Updated Date - 2022-06-12T06:00:58+05:30 IST