సెలవు అడిగితే అసభ్యంగా ప్రవర్తించారు
ABN, First Publish Date - 2022-06-12T07:21:58+05:30
: సెలవు అడిగితే ఇవ్వకపోగా తన పట్ల ఎంపీడీవో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ పిఠాపురం మండలపరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న దళిత మహిళ పిఠాపురం పోలీసులకు ఫిర్యా
ఎంపీడీవోపై మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు
చర్యలు లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహం
హోం మంత్రి గారూ ఇదేనా దళిత మహిళకు జరిగే న్యాయం
పిఠాపురం, జూన్ 11: సెలవు అడిగితే ఇవ్వకపోగా తన పట్ల ఎంపీడీవో అసభ్యకరంగా ప్రవర్తించారంటూ పిఠాపురం మండలపరిషత్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న దళిత మహిళ పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై తొలుత ఫిర్యాదు కూడా స్వీకరించకపోవడంతో 100కు ఫోన్ చేయడంతో తీసుకున్నారని, నెలరోజులు గడిచినా ఇంతవరకూ చర్యలు లేవని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేస్తూ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్సఎన్ వర్మను ఆశ్రయించింది. ఉద్యోగం చేసుకునే ఒక దళిత మహిళ తనకు న్యాయం చేయమని పోలీసులను ఆశ్రయిస్తే విచారణ జరిపి న్యా యం చేయాల్సిన పోలీసులు కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం దారుణమని వర్మ విలేకరులకు తెలిపారు. ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడంతో నాలుగుసార్లు 100కి సదరు మహిళ ఫోన్ చేసిందని, అప్పుడు గాని ఫిర్యాదు తీసుకోలేదని తెలిపారు. మే 7వ తేదీన ఫిర్యాదు ఇవ్వ గా ఇప్పటివరకూ ఎటువంటి విచారణ చేపట్టకుండా, భాద్యులపై చర్య తీసుకోకుండా పిఠాపురం సీఐ, ఎస్ఐలు బాధితురాలినే రాజీ చేసుకోమని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో తాను అక్కడ ఉద్యోగం ఎలా చేయగలనని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేస్తున్నదని తెలిపారు. పిఠాపురం పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని, ఎమ్మెల్యే చెబితేనే కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. దళిత మహిళా ఉద్యోగికి పోలీసుస్టేషన్లో ఇటువంటి పరిస్థితి ఎదురైతే సాధారణ మహిళలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో హోంమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు చెప్పినా పిఠాపురం పోలీసులు పట్టించుకోవడం లేదంటే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలన్నారు. సదరు మహిళకు దిశ చట్టం ద్వారా న్యాయం జరుగుతుందా, ప్రభుత్వం జోక్యం చేసుకుని న్యాయం చేస్తుందా చెప్పాలని, సత్వరం ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2022-06-12T07:21:58+05:30 IST