ఇంకా మిస్టరీగానే..
ABN, First Publish Date - 2022-09-08T07:13:47+05:30
కేంద్రీయ విద్యాలయంలో మంగళవారం పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై అ ధికారులు ఇదమిద్దంగా ఒక అంచనాకు రా లేకపోతున్నారు. ఊపిరాడక, తల తిరిగి, వాంతులతో విలవిలలాడుతూ అస్వస్థతకు గురై కాకినాడ జీజీహెచ్లో చికి త్స పొందుతున్న 18మంది విద్యా ర్థుల ఆరోగ్య పరిస్థితి నయం కావడంతో వీరిని బుధవారం ఆస్పత్రినుంచి డిశ్చార్జి చేస్తున్నట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్ధ తెలిపారు.
అంతుచిక్కడంలేదు..
కేవీ స్కూల్లో అస్వస్థత ఘటన మిస్టరీలా మారింది. ఈ ఘటనకు ప్రత్యేకంగా కారణాలు ఇవీ అని చెప్పలేని సందిగ్ధంలో అధికారులు ఉన్నారు. ఎవరికి తోచిన విధంగా వారు ఏవేవో చెబుతున్నారు. స్ర్పే వినియోగంతో ఆ ప్రభావం విద్యార్థులపై పడిందని.. కాదు చెద మందుల నివారణ కోసం పెస్టిసైడ్ కొట్టించారని.. భవనం అంతా పెయింటింగ్ వేశారని.. చుట్టుపక్కల ఉన్న పలు ఎరువుల కర్మాగారాలు, పరిశ్రమలనుంచి విష వాయువుల ప్రభావమని.. ఫుడ్ పాయిజన్, చాక్లెట్లు కల్తీ, నీటి కాలుష్యం అంటూ పలు రకాలుగా ఎవరికి తోచినట్టుగా వారు చెబుతుండడంతో గందరగోళం నెలకొంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు మరింత ఆందోళనకు లోనవుతున్నారు. కలెక్టర్ నియమించిన కమిటీ సభ్యులు సైతం విద్యార్థుల అస్వస్థతపై ఒక నిర్ధారణకు రాలేకపోవడం విశేషం. కనీసం ప్రాథమిక నిర్ధారణకు రాలేకపోవడం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు.
రెండోరోజు విచారణ
కాకినాడ రూరల్ మండలం వలసపాకల కేంద్రీయ విద్యాలయంలో కమ్యూనిటీ మెడిసిన్ హెచ్వోడీ, వైద్య బృందం ఆధ్వర్యంలో బుధవారం విచారణ నిర్వహించారు. ఊపిరాడక, కళ్లుతిరిగి, వాంతులతో సొమ్మసిల్లి పడి తీవ్ర అస్వస్థతకు గురైన 18మంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన సం ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం కలెక్టర్ కృతికాశుక్లా విచారణ బృందం ఏర్పాటు చేశారు. కమ్యూనిటీ మెడిసిన్ హెచ్వోడీ దేవీ మాధవి, డాక్టర్ రుక్మిణి, మైక్రో బయాలజీ డిపార్టుమెంట్నుంచి డాక్టర్ వెంకటరమణ, పీడీయాట్రిక్స్ విభాగం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పీజీ వైద్యుల బృందం పరిశీలించింది. స్కూల్ ప్రాంగణంలోని నీటి నమూనాలు సేకరించారు. ప్రిన్సిపాల్, టీచర్ల నుంచి వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. విద్యార్థుల బ్లడ్ శాంపుల్స్ని హైదరాబాద్లో ని ఐఐసీ ల్యాబ్కు జిల్లా ఎపిడిమిక్ సెల్ ద్వారా తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు. బయోకెమికల్ రిపోర్టు రెండు, మూడురోజు ల్లో వచ్చే అవకాశం ఉందని, ప్రాథమిక రిపోర్టు గురువారం రావొచ్చని వారు తెలిపారు. సర్పవరం ఎస్హెచ్వో ఆకుల మురళీకృష్ణ, విద్యాశాఖనుంచి డీవైఈవో ఆర్జేడీ రాజు, ఎంఈవో ఎల్.గణేష్బాబు విచారణ నిర్వహించారు. కాలుష్య, ఫ్యాక్టరీస్, ఫైర్ విభాగాల ప్రాథమిక రిపోర్టు నివేదిక గురువారం కలెక్టర్కు నివేదిక అందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైద్యుల ప్రాథమిక నివేదికను గురువారం కలెక్టర్కు అందించనున్నట్లు ఆర్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ నరసింహం తెలిపారు.
Updated Date - 2022-09-08T07:13:47+05:30 IST