చేర నీ పాద దీపం..
ABN, First Publish Date - 2022-11-25T00:42:21+05:30
ఆర నీకుమా ఈ దీపం కార్తీక దీపం.. చేర నీ పాద దీపం కర్పూర దీపం అంటూ మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేశారు.
చివరి రోజు భక్తజనంతో కిటకిటలాడిన గోదావరి తీరం
రాజమహేంద్రవరం సిటీ/ కొవ్వూరు, నవంబరు 24 : ఆర నీకుమా ఈ దీపం కార్తీక దీపం.. చేర నీ పాద దీపం కర్పూర దీపం అంటూ మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేశారు. పోలి పాడ్యమి సందర్భంగా గోదావరి తీరం దీపాలతో దేదీప్యమానంగా ప్రకాశించింది. పెద్దసంఖ్యలో భక్తులు రాజమహేంద్రవరం పుష్కర్ఘాట్, కోటిలింగాల ఘాట్, సరస్వతి ఘాట్, కొవ్వూరు గోష్పాదక్షేత్రం కిటకిటలాడాయి. వేకువజాము నుంచి గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమోగింది. గత 30 రోజులుగా మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక మాస పూజలు చేసారు. ప్రతిసోమవారం నోములు నోచుకున్నారు. చలినిసైతం లెక్కచేయక గోదావరి స్నానాలను వేకువ జామున చేసి కార్తీక దీపాలను వదిలారు. కార్తీకమాసం గురువారం ముగియ డంతో చివరి రోజు నదీలో ఉసిరి కాయలు, కొబ్బరి చిప్పలు, అరటి డొప్పల్లో వత్తుల దీపాలను వెలిగించి నదిలో విడిచిపెట్టారు. పూర్వం పోలమ్మ అనే మహిళ కార్తీకమాసం నెల రోజులు క్రమం తప్పకుండా నియమ నిష్టలతో దీపారాధన చేసి పరమ శివున్ని పూజించి మోక్షం పొందిందని. కార్తీకమాసం ముగిసిన పాడ్యమి రోజు స్వర్గ ప్రాప్తి పొందిందని పురాణ కథనం. కార్తీకమాసం ముగిసిన అనంతరం నదీస్నానాలు ఆచరించి, దీపాలను నదిలో వదిలితే సకల పాపాలు పోయి స్వర్గం ప్రాప్తిస్తుందని పండితులు చెబుతతున్నారు.
Updated Date - 2022-11-25T00:42:24+05:30 IST