పెద్దాస్పత్రికి సుస్తీ..?
ABN, First Publish Date - 2022-05-18T07:02:16+05:30
కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి సుస్తీ చేసింది. రోగ నిర్ధారణలో వైద్యులకు కీలకంగా ఉపయోగపడే పలు ప్ర ముఖమైన వైద్య పరికరాలు మరమ్మతుకు గురై మూలకు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
- జీజీహెచ్లో మొరాయిస్తున్న పలు రకాల వైద్య పరికరాలు
- ధీరుబాయి అంబాని భవనంలో మరమ్మతుకు గురైన ఏయూ 480 మిషన్.. బయోకెమిస్ట్ టెస్ట్లకు కీలకం
- 1500 రకాల పరీక్షల నిర్వహణకు ఆటంకం
- సీటీ స్కాన్, ఎంఆర్ఐ, థైరాయిడ్ మిషన్లదీ అదే పరిస్థితి
జీజీహెచ్ (కాకినాడ), మే 17: కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి సుస్తీ చేసింది. రోగ నిర్ధారణలో వైద్యులకు కీలకంగా ఉపయోగపడే పలు ప్ర ముఖమైన వైద్య పరికరాలు మరమ్మతుకు గురై మూలకు చేరడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫలితంగా పలు రకాల వైద్యనిర్ధారణ టెస్ట్ల కోసం ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి రావడంతో నిరుపేదలు ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ధీరూబాయి అంబాని ల్యాబ్లో రూ.40లక్షలతో ఏర్పాటు చేసిన ఏయూ 480 మిష న్ మరమ్మతుకు గురవ్వడంతో పరిస్థితి సంక్లిష్టంగా మారింది. పేద రోగుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వైద్యపరికరాల మరమ్మతు కు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
మూలకు చేరిన ఏయూ 480 మిషన్
కాకినాడ జీజీహెచ్లో పదేళ్ల కిందట రూ.40లక్షలతో రక్తపరీక్షల నిర్ధారణ కోసం ధీరూబాయి అంబాని భవనంలో ఏయూ 480 మిషన్ ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో ఉన్న 26 విభాగాల వైద్యులు రోగుల వ్యాధి నిర్ధారణకోసం నిత్యం 400 శాంపుల్స్తోపాటు పలు రకాల పరీక్షల 1500 వరకు నిర్వహిస్తుంటారు. ఇక్కడ రక్తపరీక్షలు అత్యంత కచ్చితత్వంతో చేస్తుంటారు. ఎమర్జెన్సీ వార్డులోని రోగులకు అనుక్షణం సేవలందిస్తుంటారు. 45రోజులుగా ఈ మిషన్ పనిచేయకపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతు చే యించేందుకు నిధులు లేకపోవడంతో ఏయూ మిషన్ సేవలు అందడం లేదు. దీంతో అనారోగ్యంతో ఆస్పత్రి కి వచ్చే రోగులు, గర్భిణులు టెస్ట్ల కోసం ప్రైవేట్ కేం ద్రాలకు వెళ్లి డబ్బులు వెచ్చించాల్సి రావడం, స్కానిం గ్ చేయించుకోవాల్సి పరిస్థితులు నెలకొన్నాయి. బయోకెమిస్ట్ టెస్ట్లకు ఇది ఎంతో కీలకంగా ఉంటుంది. ఈ మిషన్ పదేళ్ల కిందట కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఈ మిషన్ సామర్ధ్యం తగ్గిపోయిందని, సరైన నిర్వహణ, సకాలంలో సర్వీసింగ్ చేసినట్లయితే మరింతకాలం మిషన్ పనిచేసే వీలుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీటితోపాటు ఎంఆర్ఐ మిషన్, థైరాయిడ్ పరీక్షించే మిషన్ కూడా మరమ్మతుకు గురయ్యాయని, ఆర్థిక లేమితో వీటికి మరమ్మతు చేయించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని వాపోతున్నారు. నిధుల సమస్య వెన్నాడడంతో ఆస్పత్రిలో ఏ చిన్నపాటి సమస్య వచ్చినా నెలల తరబడి పరిష్కారం, మరమ్మతులు చేయించే పరిస్థితులు లేకపోవడంపట్ల రోగుల బంధువు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం హెచ్డీఎస్లో నిధులు అందుబాటులో ఉన్నా రూ.2, 3 లక్షలు వెచ్చిస్తే బాగయ్యే మిషన్లు కూడా మరమ్మతులు చేయించలేని పరిస్థితులు నెలకొన్నాయని వాపోతున్నారు. సిటీస్కాన్ మిషన్ కూడా మరమ్మతుకు లోనవుతుందని, ఇది కూడా పూర్తిగా పాడై మూలకు చేరితే రోగులు మరింత ఇక్కట్లకు గురయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యపరికరాల మరమ్మత్తులపై జిల్లా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - 2022-05-18T07:02:16+05:30 IST