అత్యాచార నేరాల నివారణ కోసం శిక్షలు వేగవంతానికి చర్యలు
ABN, First Publish Date - 2022-06-07T06:47:11+05:30
సమాజంలో అత్యాచారా నేరాల నివారణ కోసం నేరస్థులకు కఠిన శిక్షలతోపాటు శిక్షలు వేగవంతంగా అమలు చేయాలని, ఇందుకోసమే ప్రభుత్వం దిశ, పోక్సో చట్టాలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీరెడ్డి తెలిపారు.
రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీరెడ్డి
జీజీహెచ్ (కాకినాడ), జూన్ 6: సమాజంలో అత్యాచారా నేరాల నివారణ కోసం నేరస్థులకు కఠిన శిక్షలతోపాటు శిక్షలు వేగవంతంగా అమలు చేయాలని, ఇందుకోసమే ప్రభుత్వం దిశ, పోక్సో చట్టాలను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు జయశ్రీరెడ్డి తెలిపారు. సోమవారం కాకినాడ జీజీహెచ్లోని దిశ వన్స్టాప్ సెంటర్లో అత్యాచార బాధిత బాలికను కలుసుకుని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత బాలికను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. సభ్య సమాజం సిగ్గుపడేలా సంరక్షించాల్సిన కరస్పాండెంట్ విజయ్కుమార్ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, ఇది క్షమించరాని నేరమన్నారు. ఆడపిల్లలను చెడు దృష్టితో చూసే పోకడలను సమూలంగా అరికట్టేందుకు ముందుకు రావాలని కోరారు. నిందితుడుకి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగంతో మాట్లాడటం జరిగిందని, భవిష్యత్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టంగా నిందితుడుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్నారు. బాలికపై జరిగిన సంఘటనపై నివేదిక తయారుచేసి ప్రభుత్వానికి అందించి, సత్వర సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా బాలికకు అందుతోన్న వైద్య చికిత్సలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటబుద్దను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలికి మెరుగైన వైద్యసేవలు అందించి సత్వరంగా కోలుకునేలా కృషిచేయాలని వైద్యులకు సూచించారు. ఆమె వెంట దిశ వన్స్టాప్ సెంటర్ అడ్మిన్ శైలజ, న్యాయవాది నాగలక్ష్మి, సీఐ పి.రామచంద్రరావు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-07T06:47:11+05:30 IST