భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు మూలపురుషుడు పొట్టి శ్రీరాములు
ABN, First Publish Date - 2022-11-02T01:12:12+05:30
భాషా ప్రయుక్త రాష్ర్టాల అవతరణకు మూల పురుషు డిగా పొట్టిశ్రీరాములు నిలిచారని జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా పేర్కొన్నారు.
అమలాపురం, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): భాషా ప్రయుక్త రాష్ర్టాల అవతరణకు మూల పురుషు డిగా పొట్టిశ్రీరాములు నిలిచారని జిల్లా కలెక్టర్ హిమాన్షుశుక్లా పేర్కొన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ర్టాల విభజన జరుగుతుందని, అందుకు భిన్నంగా భాషా ప్రయుక్త రాష్ర్టాల ఏర్పాటుకు అమరజీవి నాంది పలికారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం 58 రోజులపాటు నిరాహార దీక్షచేసి ప్రాణ త్యాగం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు. జిల్లా కలెక్టరేట్లో మంగళవారం 67వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలిసారిగా వేడుకలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎందరో మహనీయుల త్యాగాల వల్ల ఏర్పడిన రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం ప్రతీ లబ్ధిదారునికి చేర్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పార దర్శకతతో పనిచేయాల్సి ఉందన్నారు. మహనీయుల ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుని త్రికరణ శుద్ధితో ముందుకు సాగాలన్నారు. నెల్లూరు జిల్లాకు, తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టిశ్రీరాములు పేరు పెట్టి ఆయనను గౌరవించుకోవడం జరిగిందన్నారు. నవంబరు 1న రాష్ట్ర అవతరణ నిర్వహించాలని, పాత సంప్రదాయాన్ని ఇకపైనా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ వేడుకలను జరుపుతోందని చెప్పారు. రాష్ట్ర విభజన నాటి పరిణామాలను ఆయన వివరించారు. తొలుత పరేడ్ కమాండర్ విజయ్భాస్కర్ నేతృత్వంలో పోలీసు కవాతు నిర్వహించగా కలెక్టర్ హిమాన్షుశుక్లా గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. కార్యక్ర మంలో జాయింట్ కలెక్టర్ హెచ్ఎం ధ్యానచంద్ర, జిల్లా రెవెన్యూ అధికారి సీహెచ్ సత్తిబాబు, పి.గన్న వరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, ఏపీ నాటక అకాడమీ చైర్మన్ హరిత రాజగోపాల్, అదనపు ఎస్పీ కె.లతామాధురి, డీఎస్పీ వై.మాధవరెడ్డి, ఆర్డీవోలు ఎన్ఎస్వీబీ వసంతరాయుడు, ముక్కంటి, సీపీవో వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ వి.అయ్యప్పనాయుడు, చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి, డీఈవో ఎన్వీ రవిసాగర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-02T01:12:16+05:30 IST