ఆస్తులు సంపాదించలేదని ప్రమాణం చేస్తావా?
ABN, First Publish Date - 2022-06-27T07:57:13+05:30
ఆస్తులు సంపాదించలేదని ప్రమాణం చేస్తావా?
పుష్పశ్రీవాణిని ప్రశ్నించిన ఆడపడుచు పల్లవి రాజు
త్వరలో టీడీపీలో చేరి సేవలందిస్తానని ప్రకటన
పార్వతీపురం, జూన్ 26(ఆంధ్రజ్యోతి): ‘ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అక్రమ ఆస్తులు సంపాదించలేదని కుల దేవతపై ప్రమాణం చేస్తావా’? అంటూ తాజా మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణికి ఆమె సొంత ఆడపడుచు శత్రుచర్ల పల్లవిరాజు సవాల్ విసిరారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం లో ఆదివారం మాట్లాడారు. ఇకపై కురుపాం నియోజకవర్గంలో రౌడీ రాజకీయం నడవదని, అడ్డుకుంటామని అన్నారు. ‘నేను ఆదేశిస్తే.. టీడీపీ నేతలు పొలిమేరల్లోకి రాలేరు’ అని ఇటీవల వైసీపీ ప్లీనరీలో పుష్పశ్రీవాణి చేసిన వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.
శత్రుచర్ల కుటుంబం నుంచి కోడలిగా రెండుసార్లు గెలిచి, చివరకు తమ కుటుంబంలోనే చిచ్చుపెట్టిన ఘనత పుష్పశ్రీవాణికే దక్కుతుందన్నారు. మూడేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోగా, సమస్యలపై ప్రశ్నించేవారిపై పోలీసు కేసు లు పెట్టించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. త్వరలోనే చంద్రబాబునాయుడును కలుస్తానని, ఆయన సారథ్యంలో పార్టీకి సేవ చేస్తానని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు.
Updated Date - 2022-06-27T07:57:13+05:30 IST