తలా తోక లేకుండా జిల్లాల విభజన: జవహర్
ABN, First Publish Date - 2022-04-05T00:16:17+05:30
ఆదాయం పెంపు, రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ రెడ్డి
అమరావతి: ఆదాయం పెంపు, రాజకీయ ప్రయోజనాల కోసమే సీఎం జగన్ రెడ్డి తలాతోక లేకుండా జిల్లాల విభజన చేశారని టీడీపీ నాయకుడు జవహర్ అన్నారు. అశాస్త్రీయంగా, అసంబద్ధంగా, రాజకీయ ఒత్తిళ్లతో, ఆదాయమే లక్ష్యంగా చేసిన జిల్లాల విభజనను తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే సరి చేస్తుందని ఆయన తెలిపారు. రాజధాని లేని రాష్ట్రానికి తలలేని మొండెల్లా జగన్ రెడ్డి జిల్లాలను తీసుకొచ్చాడని ఆయన ఆరోపించారు. ఉదయం జిల్లాల ప్రకటన వెలువడితే, సాయంత్రానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం దేనికోసమని ఆయన మండిపడ్డారు. విజయవాడ పక్కనున్న గన్నవరాన్ని ఎక్కడో ఉన్న మచిలీపట్నంలో కలపడమేనా ప్రభుత్వం చేసిన మేథోమథనం అని ఆయన ప్రశ్నించారు. మడకశిర, హిందూపరం, ధర్మవరం ప్రాంతాలకు ఏది దగ్గరో, దూరమో ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ కుతెలియదా అని ఆయన ప్రశ్నించారు. కుప్పం గురించి మాట్లాడుతున్న ముఖ్యమంత్రికి, పులివెందులలో బస్టాండ్ కూడా లేదని తెలియద అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తెలుగుజాతి మొత్తానికి నాయకుడని, ఆయన్ని ఒక జిల్లాకు పరిమితం చేయడం ఏమిటన్నారు. అంబేద్కర్, బాబూ జగజ్జీవన్ రామ్ల పేర్లు జిల్లాలకు పెట్టాలని ముఖ్యమంత్రికి తెలియదా, గుర్తు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. కల్తీసారా, మద్యం, విద్యుత్ ఛార్జీలు, పెరిగిన నిత్యావసరధరల గురించి ప్రజలు మర్చిపోవాలనే జగన్ రెడ్డి కొత్త జిల్లాల నాటకం మొదలెట్టారని ఆయన ఆరోపించారు.
Updated Date - 2022-04-05T00:16:17+05:30 IST