కోడికత్తి, బాబాయ్ గొడ్డలిపోటు ఇప్పటికీ మిస్టరీగా ఉన్నాయి: ధూళిపాళ్ల
ABN, First Publish Date - 2022-04-08T20:21:21+05:30
కోడికత్తి, బాబాయ్ గొడ్డలిపోటు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయని, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు.
అమరావతి: కోడికత్తి, బాబాయ్ గొడ్డలిపోటు ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయని, దీన్ని బట్టే జగన్ విశ్వసనీయత ఏమిటో అర్థమవుతోందని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రావణుడి వలే జగన్కూ 10 అవినీతి తలలు ఉన్నాయన్నారు. అదానీకి మేలుచేయడానికి విద్యుత్ రంగాన్ని.. సీఎం నాశనం చేస్తున్నారని అధికారులే వాపోయారన్నారు. మూడేళ్లలో రాష్ట్రంలో 1500 మంది ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరిగినా..15 మంది నిందితులకు కూడా శిక్షపడలేదని ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రస్థాయిలో విమర్శించారు.
మూడేళ్ల జగన్ రెడ్డి పాలన నిజంగానే ప్రజలకు ఏడుపే మిగిల్చిందని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. జగన్ రెడ్డిని ఎందుకు ముఖ్యమంత్రిని చేశామా అని ప్రజలు రోజూ ఏడుస్తుంటే, ఆయనేమో ప్రతిపక్షాలు ఏడుస్తున్నాయంటున్నారని మండిపడ్డారు. ఎల్లోమీడియా గొప్పతనం గురించి మాట్లాడే జగన్ రెడ్డి, గొడ్డలి పోటుని గుండెపోటుగా చిత్రీకరించిన బ్లూ మీడియాను చూసిగర్వపడాల్సిందేనన్నారు. పింక్ డైమండ్.. కోడికత్తి కథలను బ్లూ మీడియాలో చూపిన విధంగా ఎవరైనా చూపించారా?.. ఆకథలన్నీ ఏమయ్యాయో ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడరని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.
Updated Date - 2022-04-08T20:21:21+05:30 IST