దళిత మహిళపై పోలీసుల కక్షసాధింపు
ABN, First Publish Date - 2022-12-10T02:31:42+05:30
ఒక కేసు కాకుంటే మరో కేసు. తాము అనుకుంటే చాలు విపక్ష నేతలెవరైనా జైలుకు వెళ్లాల్సిందే. ఇదీ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసుల తీరు.
సోషల్ మీడియా పోస్టింగ్పై కేసు.. బెయిల్
24 గంటలు గడవక ముందే హత్యాయత్నం కేసు
తాడిపత్రి, డిసెంబరు 9: ఒక కేసు కాకుంటే మరో కేసు. తాము అనుకుంటే చాలు విపక్ష నేతలెవరైనా జైలుకు వెళ్లాల్సిందే. ఇదీ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసుల తీరు. టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కొంకరి కమలమ్మ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. తాడిపత్రిలో పారిశుధ్య పనులకు నిధుల కొరతను నిరసిస్తూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి బుధవారం భిక్షాటనకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల చర్యను తప్పుబడుతూ కమలమ్మ సోషల్ మీడియాలో వీడియో పెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. కమలమ్మను కోర్టులో హాజరుపరచగా కోర్టు వెంటనే బెయిల్ ఇచ్చింది. కానీ పోలీసులు 24 గంటలు గడవక ముందే... శుక్రవారం ఆమెపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు.
అసలు జరిగింది ఇదీ...
ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి జేసీ అశ్మిత్రెడ్డి గతనెల 23న తాడిపత్రి పట్టణంలో పర్యటించారు. దీన్ని అడ్డుకునేందుకు వైసీపీ వర్గీయులు రాళ్ల దాడికి దిగారు. ఆ సమయంలో టీడీపీ కార్యకర్తలు ప్రతిదాడి చేశారు. ఈ ఘటనలో వైసీపీ వర్గీయులపై నామమాత్రపు కేసులు పెట్టిన పోలీసులు టీడీపీ వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదుచేశారు. అదే కేసులో కమలమ్మను 32వ ముద్దాయిగా చేర్చారు. శుక్రవారం అరెస్ట్టు చేసి తాడిపత్రి ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆమెను రెడ్డిపల్లి జైలుకు రిమాండ్కు తరలించాలని ఆదేశించింది. పోలీసుల వేధింపుల కారణంగా అప్పటికే మనోవేదనకు గురైన కమలమ్మ, ఈ పరిణామంతో కోర్టు ఆవరణలోనే సొమ్మసిల్లిపోయారు. తేరుకున్నాక ఆమెను రిమాండ్కు తరలించారు. దీనిని కవర్ చేసేందుకు వెళ్లిన విలేకరుల పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించారు.
ఎమ్మెల్యే అండతో డీఎస్పీ అరాచకం: జేసీ
ఎమ్మెల్యే పెద్దారెడ్డి అండతో తాడిపత్రి డీఎస్పీ చైతన్య అరాచకాలకు పాల్పడుతున్నారని, టీడీపీ వర్గీయులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నాడని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. కమలమ్మపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై (పురుషులు) కేసులు పెట్టడం పూర్తికావడంతో టీడీపీ మహిళలను టార్గెట్ చేశారని ఆరోపించారు. డీఎస్పీ చైతన్య సైకోలా వ్యవహరిస్తున్నారని అన్నారు. టీడీపీ వర్గీయులపై కేసులు నమోదు చేసేందుకు డీఎస్పీకి ప్రతినెలా ఎమ్మెల్యే ముడుపులు ఇస్తున్నాడని ఆరోపించారు. డీఎస్పీ కనుసన్నల్లో పెద్దఎత్తున గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని, అందులో ఒక ఎస్ఐ, ఆయన బంధువు పాత్ర ఉందని ఆరోపించారు.
Updated Date - 2022-12-10T02:31:43+05:30 IST