కన్నా కోడలికి రూ.కోటి పరిహారం
ABN, First Publish Date - 2022-01-20T07:32:48+05:30
కన్నా కోడలికి రూ.కోటి పరిహారం
నెలకు 50వేలు భరణం చెల్లించాలి
గృహహింస కేసులో కోర్టు తీర్పు
విజయవాడ, జనవరి 19(ఆంధ్రజ్యోతి): గృహహింస కేసులో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలికి రూ.కోటి పరిహారం చెల్లించాల ని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు విజయవాడలోని ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి టి.వెంకట శివసూర్య ప్రకాశ్ బుధవారం తీర్పు చెప్పారు. వివరాలు... కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు, గుంటూరు మాజీ మేయరు కన్నా నాగరాజు తన మేనమామ కుమార్తె శ్రీలక్ష్మి కీర్తిని 2006లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం నాగరాజు తల్లి విజయలక్ష్మికి ఇష్టం లేదు. దీంతో కుటుంబంలో వివాదాలు మొదలయ్యాయి. 2013లో శ్రీలక్ష్మి కీర్తికి పాప జన్మించింది. ఆ తర్వాత 2015 మార్చిలో తల్లీబిడ్డను ఇంటినుంచి బయటకు పంపేశారు. దీనిపై శ్రీలక్ష్మి కీర్తి విజయవాడ ఒకటో చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో గృహహింస పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. శ్రీలక్ష్మి కీర్తికి రూ.కోటి పరిహారంతో పాటు నెలకు రూ.50వేలు భరణంగా చెల్లించాలని, కోర్టు ఖర్చుల కింద రూ.1,000 ఇవ్వాలని తీర్పు చెప్పింది. పాపకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యానికి శ్రీలక్ష్మి ఖర్చు చేసిన రూ.50వేలు కూడా తిరిగి చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మొత్తానికి 12శాతం వడ్డీ చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చారు. శ్రీలక్ష్మితో పాటు కుమార్తెకు ఇంట్లో భాగస్వామ్యం కల్పించాలని స్పష్టం చేశారు. తీర్పు ఉత్తర్వులు విడుదలైన 3 నెలల్లోపు ఇవన్నీ అమలు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Updated Date - 2022-01-20T07:32:48+05:30 IST