టీడీపీలోకి వైసీపీ శ్రేణులు
ABN, First Publish Date - 2022-07-02T05:50:30+05:30
కుప్పం నియోజకవర్గంలో టీడీపీలోకి వైసీపీ శ్రేణుల వలస కొనసాగుతోంది. కుప్పం మండలం మల్లానూరు పంచాయతీకి చెందిన కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలో శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు
విజయవాడలో చంద్రబాబు సమక్షంలో చేరిక
కుప్పం, జూలై 1: కుప్పం నియోజకవర్గంలో టీడీపీలోకి వైసీపీ శ్రేణుల వలస కొనసాగుతోంది. కుప్పం మండలం మల్లానూరు పంచాయతీకి చెందిన కొంతమంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలో శుక్రవారం పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయన్నారు. కుప్పంలో వాపును బలుపుగా చెప్పుకుని ఆ పార్టీ నాయకులు భుజాలు చరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. జగన్ విధానాలపట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడడమే కాకుండా టీడీపీ పట్ల సానుకూలత పెరిగిందని చెప్పారు. ఇప్పుడు అందరి చూపూ తమ పార్టీవైపే ఉందని, దీనికి ఇటీవల వైసీపీనుంచి టీడీపీలోకి చేరికలే నిదర్శమన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించడానికి ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారన్నారు. జగన్ ఇంటి బాట పట్టడం తథ్యమన్నారు. కాకపోతే టీడీపీలోని నాయకులంతా ప్రజలే చూసుకుంటారులే అనుకుంటే అంతకుమించిన పొరపాటు లేదన్నారు. ప్రజలతో మమేకమై, నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉంటూ వారి కష్టసుఖాలు పంచుకుంటూ దగ్గర కావాలని, ప్రజల మనసు గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో చేరి పనిచేసే వారికే మంచి భవిష్యత్తు పార్టీలో ఉంటుందని, పదవులు సైతం వరిస్తాయన్నారు. వైసీపీనుంచి టీడీపీలో చేరిన శ్రేణులకు ఆయన అభినందించారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి పి.మనోహర్ కుప్పంలో మాట్లాడుతూ... వైసీపీ నాయకుడు టీఆర్.రాజేంద్ర ఆధ్వర్యంలో మల్లానూరు పంచాయతీకి చెందిన 180 మంది నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరినట్టు ప్రకటించారు. కుప్పం నియోజకవర్గంలో టీడీపీకి పెరుగుతున్న జనాదరణక ఇది నిదర్శనమన్నారు.
Updated Date - 2022-07-02T05:50:30+05:30 IST