వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులకు వన్యమృగాల బలి!
ABN, First Publish Date - 2022-09-14T06:10:50+05:30
పొలాల్లో అక్రమంగా విద్యుత్ తీగలను వేటగాళ్లు ఏర్పాటు చేస్తుండడంతో వన్యమృగాలు బలైపోతున్నాయి. అడవి పందులు, దుప్పులు, కుందేళ్లు తదితర జంతువులు విద్యుత్ తీగలకు బలైపోతున్నాయి.
పట్టించుకోని అటవీ, విద్యుత్ శాఖల అధికారులు
చౌడేపల్లె, సెప్టెంబరు 13: పంట పొలాల్లో అక్రమంగా విద్యుత్ తీగలను వేటగాళ్లు ఏర్పాటు చేస్తుండడంతో వన్యమృగాలు బలైపోతున్నాయి. అడవి పందులు, దుప్పులు, కుందేళ్లు తదితర జంతువులు విద్యుత్ తీగలకు బలైపోతున్నాయి. చౌడేపల్లె మండలంలోని ముదిరెడ్డిపల్లె, మేకలచిన్నేపల్లె, సామిరెడ్డిపల్లె, మొడుకూరుల్లో నెలకు సుమారు 30 నుంచి 40 అడవి పందులు వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులకు బలైపోతున్నాయి. ఇటీవల ముదిరెడ్డిపల్లెలో అక్రమ విద్యుతీగలకు రెండు అడవి పందులు బలి కాగా 15 రోజుల క్రితం 4 దుప్పులు, 2 ఆడవి పందులు మృత్యువాత పడ్డాయి. సామిరెడ్డిపల్లెలో అడవి పంది మాంసం కిలో రూ.250, దుప్పి మాంసం కిలో రూ.300 చొప్పున గుట్టుచప్పుడు కాకుండా ఇళ్లల్లోనే విక్రయిస్తున్నారు. ముదిరెడ్డిపల్లెకు చెందిన కొందరు వేటగాళ్లు 15 రోజుల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలకు సుమారు 80 నుంచి 90 కిలోల 2 పెద్ద అడవి పందులు బలి కాగా వాటిని పుంగనూరులో హోల్సేల్గా పంది మాంసం విక్రయించే దుకాణదారులకు విక్రయించినట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా అటు అటవీశాఖ అధికారులు మామూళ్ల మత్తుతో పాటు మాంసం వాటాల పంచుకుని పట్టించుకోవడం లేదనే విమర్శలు లేకపోలేదు. అలాగే విద్యుత్ శాఖ అధికారులు పంట పొలాల్లో అక్రమ విద్యుత్ తీగల ఏర్పాటుపై నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వన్యమృగాల ప్రాణాలను ఉన్నాతాధికారులైనా స్పందించి రక్షించాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - 2022-09-14T06:10:50+05:30 IST