వేడెక్కుతున్న చల్లటి ప్రాంతాలు!
ABN, First Publish Date - 2022-04-24T08:43:30+05:30
చల్లటి ప్రాంతాల్లో కూడా ఈ వేసవి మండుటెండలు కాయిస్తోంది.
పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటుతున్న ఉష్ణోగ్రతలు
నేడు 11మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు
తిరుపతి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లాలో పలమనేరు, కుప్పం నియోజకవర్గాలంటే చల్లటి ప్రాంతాలుగా ప్రసిద్ధి. ఎంత మండువేసవిలో అయినా తూర్పు మండలాలతో పోలిస్తే కనీసం ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా వుంటుందన్న విషయం తెలిసిందే. అయితే అలాంటి ప్రాంతాల్లో కూడా ఈ వేసవి మండుటెండలు కాయిస్తోంది. ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా ఈ రెండు నియోజకవర్గాల్లో ఏకంగా 40డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటుతాయని వాతావరణ పరిశోధన శాఖ హెచ్చరిస్తోంది. దీన్ని బట్టి జిల్లాలో మిగిలిన మండలాల్లో పరిస్థితి ఎలా వుంటుందో తేలిగ్గా ఊహించుకోవచ్చు. శనివారం సంబంధిత శాఖ జారీ చేసిన అంచనాల నివేదికలో జిల్లాలోని 21 మండలాల్లో ఆది, సోమవారాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. జిల్లాలో మొత్తం 30 మండలాలుండగా అందులో 21మండలాల్లో అంటే 70 శాతం మండలాల్లో ఎండ వేడిమి తీవ్రంగా వుండనున్నాయి. రొంపిచెర్ల, చౌడేపల్లె, సదుం, నగరి, శ్రీరంగరాజపురం, పాలసముద్రం, పెనుమూరు, ఐరా ల,బైరెడ్డిపల్లె, రామకుప్పం, గుడుపల్లె తదితర 11మండలాల్లో ఆదివారం 39 డిగ్రీల నుంచీ 40 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. వీటిలో ఇతర మండలాల సంగతి పక్కన పెడితే బైరెడ్డిపల్లె, రామకుప్పం, గుడుపల్లె మండలాలుండడమే ఆశ్చర్యకరంగా మారింది. సముద్ర మట్టానికి బాగా ఎగువన, కౌండిన్య అభయారణ్యం చుట్టుముట్టి వున్న ఈ మండలాల్లోనే పరిస్థితి ఇలా వుంటే ఇక మిగిలిన మండలాల్లో ఉష్ణోగ్రతల గురించి ఊహించుకోవాల్సిందే.
రేపు 21 మండలాల్లో మండుటెండలు
నిండ్ర, రొంపిచెర్ల, చౌడేపల్లె, సదుం, వెదురుకుప్పం, నగరి, కార్వేటినగరం, శ్రీరంగరాజపురం, పాలసముద్రం, జీడీనెల్లూరు, పెనుమూరు, ఐరాల, తవణంపల్లె, గుడిపాల, బంగారుపాలెం, యాదమరి, బైరెడ్డిపల్లె, వి.కోట, రామకుప్పం, కుప్పం, గుడుపల్లె తదితర 21మండలాల్లో ఎండలు మండిపోయే అవకాశముంది. వాతావరణ శాఖ నివేదిక మేరకు ఈ మండలాల్లో అత్యల్పమంటే 39.1 డిగ్రీల నుంచీ అత్యధికంగా 41.5 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ముఖ్యంగా శ్రీరంగరాజపురం, పాలసముద్రం, గుడుపల్లె మండలాల్లో 41డిగ్రీలు దాటి ఉష్ణోగత్రలు రికార్డు కానున్నాయి. అలాగే రొంపిచెర్ల, చౌడేపల్లె, సదుం, నగరి, పెనుమూరు, ఐరాల, బైరెడ్డిపల్లె, రామకుప్పం, కుప్పం మండలాల్లో 40 డిగ్రీలకు పైబడి ఎం డ వేడిమి నమోదు కానుంది.
మండలం నేడు రేపు
నిండ్ర - 39.6
రొంపిచెర్ల 39.0 40.3
చౌడేపల్లె 39.2 40.5
సదుం 39.2 40.5
వెదురుకుప్పం 39.4
నగరి 39.7 40.8
కార్వేటినగరం 39.1
శ్రీరంగరాజపురం 40.3 41.3
పాలసముద్రం 40.3 41.3
జీడీనెల్లూరు 39.2
పెనుమూరు 39.7 40.8
ఐరాల 39.0 40.1
తవణంపల్లె 39.2
గుడిపాల 39.8
యాదమరి 39.3
బంగారుపాలెం 39.3
బైరెడ్డిపల్లె 39.4 40.6
వి.కోట 39.5
రామకుప్పం 39.2 40.3
గుడుపల్లె 40.5 41.5
కుప్పం 40.1
నేడు, రేపు జాగ్రత్త
తిరుపతి, ఏప్రిల్ 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నేడు, రేపు ఎండలు మండిపోనున్నాయి. వాతావరణ శాఖ అంచనాలను బట్టి చూస్తే దాదాపుగా జిల్లాయావత్తూ సూర్య ప్రతాపం చవిచూడనుంది.జిల్లాలోని 26 మండలాల పరిధిలో ఆదివారం పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచీ 41.6 డిగ్రీల దాకా నమోదు కానున్నాయి. గూడూరు, చిట్టమూరు, ఎర్రావారిపాలెం, కోట, రేణిగుంట, కేవీబీపురం, చిన్నగొట్టిగల్లు, సూళ్ళూరుపేట, డక్కిలి, సత్యవేడు, పాకాల, వాకాడు, నాయుడుపేట,, దొరవారిసత్రం, ఏర్పేడు , చంద్రగిరి, బీఎన్ కండ్రిగ, వరదయ్యపాలెం, తడ, శ్రీకాళహస్తి, తిరుపతి రూరల్, బాలాయపల్లి, చిల్లకూరు, నారాయణవనం, తొట్టంబేడు, వడమాలపేట మండలాల్లో ఎండల తీవ్రత అధికంగా వుండే అవకాశాలున్నాయి. కేవలం తొమ్మిది మండలాల్లో మాత్రమే 39 డిగ్రీల కంటే తక్కువ వేడిమి నమోదు కానుంది.
రేపు 31 మండలాల్లో 42.9 డిగ్రీల దాకా వేడిమి
ఈనెల 25వ తేదీ సోమవారం దాదాపుగా జిల్లా అంతటా మండుటెండలు జనాన్ని ఠారెత్తించనున్నాయి. ఏకంగా 31 మండలాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కనిష్ట ఉష్ణోగ్రతే 39 డిగ్రీలు కావడం గమనార్హం. గరిష్టంగా అయితే ఇంచుమించు 43 డిగ్రీలకు చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. మండలాల వారీగా చూస్తే గూడూరు, చిట్టమూరు, ఎర్రావారిపాలెం, కోట, రేణిగుంట, కేవీబీపురం, చిన్నగొట్టిగల్లు, సూళ్ళూరుపేట, డక్కిలి, సత్యవేడు, పాకాల, వాకాడు, నాయుడుపేట, దొరవారిసత్రం, ఏర్పేడు, చంద్రగిరి, బీఎన్ కండ్రిగ, వరదయ్యపాలెం, తడ, శ్రీకాళహస్తి, తిరుపతి రూరల్, బాలాయపల్లి, చిల్లకూరు, నారాయణవనం, తొట్టంబేడు, వడమాలపేట, పెల్లకూరు, వెంకటగిరి, తిరుపతి అర్బన్, పుత్తూరు, ఓజిలి మండలాల్లో పరిస్థితి తీవ్రంగా వుండనుంది. వీటిలో పెల్లకూరు, వెంకటగిరి, తిరుపతి అర్బన్, పుత్తూరు, ఓజిలి తదితర ఐదు మండలాలు మినహా 26 మండలాల్లో పగటి గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల నుంచీ 42.9 డిగ్రీల దాకా నమోదు కానుండడం గమనార్హం.
ప్రభుత్వ చలివేంద్రాలెక్కడ?
ఇదివరకూ జిల్లా యంత్రాంగం నడి వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేసేది. జిల్లా కేంద్రం సహా డివిజన్, మండల కేంద్రాలన్నింటిలో రెవిన్యూ యంత్రాంగం ద్వారా చలివేంద్రాలు ఏర్పాటు చేయించేది. ప్రధాన కూడళ్ళలో నిర్వహించే చలివేంద్రాలలో తాగునీటితో పాటు మజ్జిగ కూడా అందుబాటులో వుంచేది. అదే సమయంలో వైద్యారోగ్య శాఖ ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అదే చలివేంద్రాల్లో సిద్ధంగా వుంచేవారు. కొత్తగా ఏర్పడిన జిల్లా కావడం, ఇంకా పలు శాఖలు ఇంకా సర్దుబాట్లలోనే వున్న కారణంగా ప్రస్తుత వేసవిలో వీటి గురించి జిల్లా యంత్రాంగం ఆలోచించే పరిస్థితి లేకపోయినట్టు కనిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు చొరవ తీసుకుని ఇప్పటి నుంచీ మే నెలాఖరు వరకూ జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లోని ప్రధాన కూడళ్ళలో చలివేంద్రాలు ఏర్పాటు చేయించాల్సిన అవసరముంది.
మండలం నేడు రేపు
(ఉష్ణోగ్రతలు డిగ్రీ సెల్సియ్సలలో)
గూడూరు 41.6 42.9
చిట్టమూరు 41.7 42.9
ఎర్రావారిపాలెం 41.4 42.6
కోట 41.2 42.5
రేణిగుంట 41.3 42.4
కేవీబీపురం 41.2 42.4
చిన్నగొట్టిగల్లు 41.0 42.3
సూళ్ళూరుపేట 41.1 42.2
డక్కిలి 41.0 42.1
సత్యవేడు 40.7 41.9
పాకాల 40.6 41.8
వాకాడు 40.4 41.4
నాయుడుపేట 40.4 41.4
దొరవారిసత్రం 40.4 41.3
ఏర్పేడు 40.4 41.3
చంద్రగిరి 40.3 41.3
బీఎన్ కండ్రిగ 40.1 41.3
వరదయ్యపాలెం 40.3 41.2
తడ 40.1 41.1
శ్రీకాళహస్తి 40.0 41.0
తిరుపతి రూరల్ 40.0 41.0
బాలాయపల్లి 39.9 40.9
చిల్లకూరు 39.7 40.7
నారాయణవనం 39.5 40.5
తొట్టంబేడు 39.3 40.4
వడమాలపేట 39.0 40.1
పెల్లకూరు - 39.7
వెంకటగిరి - 39.6
తిరుపతి అర్బన్ - 39.4
పుత్తూరు - 39.3
ఓజిలి - 39.1
Updated Date - 2022-04-24T08:43:30+05:30 IST