శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు
ABN, First Publish Date - 2022-07-04T05:40:04+05:30
తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది.
తిరుమల, జూలై 3 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి తిరుమల క్షేత్రం యాత్రికులతో కిటకిటలాడుతున్న విషయం తెలిసిందే. శనివారం తరహాలోనే ఆదివారం కూడా అర్ధరాత్రి వరకు రద్దీ కొనసాగింది. రాత్రి ఏడు గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లు నిండిపోయి క్యూలైన్ లేపాక్షి మీదుగా షాపింగ్ కాంప్లెక్స్, ఆస్థానమండపం నుంచి రాంభగీచ కాటేజీల వరకు దాదాపు రెండు కిలోమీటర్ల మేర వ్యాప్తించింది. దాంతో సర్వదర్శనానికి 18 గంటల దర్శన సమయం పడుతోంది. కాగా, శ్రీవారి ఆలయంతోపాటు మాడవీధులు, అన్నదానం కాంప్లెక్స్, అఖిలాండం, లడ్డూ కౌంటర్లు, బస్టాండ్ వంటి ప్రాంతాలు భక్తులతో కిక్కిరిశాయి. గదులు లేకపోవడంతో సాయంత్రానికి కేటాయింపు కేంద్రాలు మూతపడ్డాయి. తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు కూడా రద్దీగా కనిపిస్తున్నాయి. సోమవారం సాయంత్రానికి రద్దీ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Updated Date - 2022-07-04T05:40:04+05:30 IST