రెవెన్యూ స్టాంపులు వెనక్కి
ABN, First Publish Date - 2022-03-05T06:41:37+05:30
అమ్మకాలు పోను మిగిలిన స్టాంపులను అమరావతిలోని కార్యాలయానికి పంపిస్తున్నారు.
చిత్తూరు కలెక్టరేట్, మార్చి 4: స్టాంపులు, రిజిస్ర్టేషన్ శాఖ ద్వారా అమ్మకాలు జరిపి నిల్వ ఉన్న రూపాయి విలువ కలిగిన స్టాంపులను వెనక్కి పంపాలని ఆ శాఖ ఇన్స్పెక్టర్ జనరల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. చిత్తూరు రిజిస్ట్రేషన్ జిల్లా పరిధిలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రూ.29 లక్షల విలువ కలిగిన స్టాంపులు ఉన్నాయి. తిరుపతి శ్రీ బాలాజీ రిజిస్ర్టేషన్ జిల్లా పరిధిలోని 12 సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాల్లో రూ.32.20 లక్షల విలువైన స్టాంపులున్నాయి. వాటిని స్ర్టాంగ్ రూముల్లో అధికారులు భద్రపరిచారు. ఐజీ ఆదేశాల మేరకు సోమవారం లోగా అమరావతిలోని రిజిస్ర్టేషన్ శాఖ కార్యాలయానికి చేర్చనున్నారు. పోస్టల్ శాఖద్వారా వీటి అమ్మకాలు చేపట్టేందుకు రిజిస్ర్టేషన్ శాఖ చర్యలు చేపట్టింది.
లక్ష్యానికి చేరువలో..
జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి నెలాఖరుకు రూ.426.16 కోట్లకుగాను రూ.380.48 కోట్లు (91 శాతం) సాధించి లక్ష్యానికి చేరువైంది. చిత్తూరు జిల్లా రిజిస్ర్టేషన్ల శాఖలో రూ.173.54 కోట్లకు రూ.151.15 కోట్లు సాధించింది. చిన్నగొట్టిగల్లు, కుప్పం ఎస్ఆర్వోలు వందశాతానికి మించి, బంగారుపాళ్యం 64, పీలేరు 47 శాతంతో వెనుకబడి ఉన్నాయి. తిరుపతి శ్రీ బాలాజీ రిజిస్ర్టేషన్ జిల్లా రూ.252.62 కోట్లకు రూ.237.31 కోట్ల రాబడి వచ్చింది. పాకాల, పిచ్చాటూరు, రేణిగుంట ఎస్ఆర్వోలు వందశాతానికి మించగా.. శ్రీకాళహస్తి 78, సత్యవేడు 66 శాతంతో వెనుకబడి ఉన్నాయి.
Updated Date - 2022-03-05T06:41:37+05:30 IST