వీణాపాణి వైభవం
ABN, First Publish Date - 2022-09-29T06:27:18+05:30
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి మలయప్పస్వామి హంస వాహనంపై వీణాపాణి సరస్వతీమూర్తిగా భక్తులను అనుగ్రహించారు.
చిన్నశేషుడిపై బద్రి నారాయణుడు
తిరుమల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి మలయప్పస్వామి హంస వాహనంపై వీణాపాణి సరస్వతీమూర్తిగా భక్తులను అనుగ్రహించారు.భక్తుల్లో అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి కలిగించేందుకే హంస వాహనాన్ని స్వామివారు అధిరోహిస్తారని పురాణాలు ఘోషిస్తున్నాయి.రాత్రి 7 గంటలకు హంసవాహనంపై బయలుదేరిన శ్రీవారు 9 గంటల వరకు మాడవీధుల్లో విహరించారు. మలయప్పస్వామి ఉదయం ఐదుతలల చిన్నశేష వాహనంపై బద్రి నారాయణ అలంకారంలో భక్తులను కటాక్షించారు.వజ్రవైఢూర్యాలు, స్వర్ణాభరణాలం కృతుడై భక్తులను ఆకట్టుకున్నారు.వేదమంత్రాలు, కోలాటాలు, మంగళవాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహనసేవ రమణీయంగా సాగింది.ఉదయం గ్యాలరీల్లో భక్తులు పలచగా కనిపించినప్పటికీ సాయంత్రం వాతావరణం చల్లగా ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు.జీయర్స్వాములు,టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి,జేఈవోలు వీరబ్రహ్మం, సదాభార్గవి, సీవీఎస్వో నరసింహకిషోర్, తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు. అయితే గతంతో పోలిస్తే బుధవారం జరిగిన రెండు వాహనసేవల్లో భక్తుల రద్దీ మోస్తరుగానే కనిపించింది.గర్భాలయంలోని మూలమూర్తి దర్శనం కేవలం 30 నిమిషాల నుంచి గంట వ్యవధిలోనే పూర్తయింది.
Updated Date - 2022-09-29T06:27:18+05:30 IST