నకిలీ పత్రాలు సృష్టించి దొరికిపోయారు
ABN, First Publish Date - 2022-10-30T00:50:58+05:30
రూ.2కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నించిన వీఆర్వో, మరో ఇద్దరు నిందితులను రెండో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
రూ.2కోట్ల భూమి కాజేసేందుకు యత్నం
వీఆర్వో సహా ముగ్గురి అరెస్ట్
చిత్తూరు, అక్టోబరు 29 : రూ.2కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నించిన వీఆర్వో, మరో ఇద్దరు నిందితులను రెండో పట్టణ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆ వివరాలను ఎస్ఐలు మల్లికార్జున్, లోకేష్తో కలిసి సీఐ యతీంద్ర రెండో పట్టణ పోలీసు స్టేషన్లో మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల మేరకు.. కర్నూలు జిల్లా తిమ్మనాయనిపేటకు చెందిన ఇటుకల ఓబులేశు గంగవరం మండలం గండ్రాజుపల్లె రెవెన్యూ సర్వే నంబరు 322-2లో 3.47 ఎకరాల భూమి తన తాతల నుంచి సంక్రమించిందని, తనపేరు మీద పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని స్పందన కార్యక్రమంలో కలెక్టర్ హరినారాయణన్కు విన్నవించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టరేట్ ఏవో నకిలీ అడంగళ్గా ఉందని గుర్తించి, రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా నకిలీ వ్యవహారం గుట్టు రట్టయింది. ఓబులేశుకు పలమనేరుకు చెందిన గిరీష్తో పరిచయముంది. అతని ద్వారా పెద్ద చల్లారగుంట వీఆర్వో రమేష్బాబు పరిచయమయ్యాడు. ఈ ముగ్గురు కలిసి గండ్రాజుపల్లె సర్వే నంబరు 322-2లోని 3.47 ఎకరాల భూమిని కాజేయాలని నిర్ణయించారు. అది ప్రభుత్వ స్థలమని, దానికి ఓబులేశు పేరుమీద నకిలీ 1-బి అడంగళ్ తయారు చేసుకుంటే పట్టాదార్ పాసుపుస్తకాలు వస్తాయని వీఆర్వో రమేష్బాబు చెప్పాడు. ఆ పనిని కంప్యూటర్ పరిజ్ఞానమున్న పలమనేరు మండలం బోడిరెడ్డిపల్లెకు చెందిన గిరీష్తో చేయించారు. 2002లో ఓటులేశు పేరుమీద ఉన్నట్లుగా నకిలీ 1-బి అడంగళ్ను మీ-భూమి పోర్టల్ ద్వారా నకిలీ డాక్యుమెంట్ను క్రియేట్ చేశారు. కలెక్టరేట్ నుంచి తహసీల్దార్ కార్యాలయానికి ఆదేశాలు వెళితే అక్కడి అధికారులు కళ్లుమూసుకుని పట్టాదారు పాసుపుస్తకం ఇస్తారనే ఉద్దేశంతో ఓబులేశు స్పందనలో అర్జీ ఇచ్చాడు. పరిశీలించిన అధికారులు అవి నకిలీ పత్రాలుగా నిర్ధారించుకుని ఆ ముగ్గురినీ అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు.
Updated Date - 2022-10-30T00:51:02+05:30 IST