వలంటీర్ల వివక్ష!
ABN, First Publish Date - 2022-08-17T05:45:07+05:30
తమపై వలంటీర్లు వివక్ష చూపుతున్నారంటూ పెద్దపంజాణి మండలం వీరప్పల్లె పంచాయతీ సర్పంచు, ఎంపీటీసీ సభ్యులు మంగళవారం పోలీసులు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.
ఎంపీడీవో, పోలీసులకు ఫిర్యాదు చేసిన సర్పంచు, ఎంపీటీసీ సభ్యుడు
పెద్దపంజాణి, ఆగస్టు 16: తమపై వలంటీర్లు వివక్ష చూపుతున్నారంటూ పెద్దపంజాణి మండలం వీరప్పల్లె పంచాయతీ సర్పంచు, ఎంపీటీసీ సభ్యులు మంగళవారం పోలీసులు, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచుగా వెనుకబడిన తరగతులకు చెందిన మహిళ పార్వతమ్మ, ఎంపీటీసీ సభ్యుడిగా దళిత వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం ఎంపికయ్యారు. ఎన్నికైనప్పటి నుంచి తాము హాజరైన ప్రతి సమావేశాన్ని వలంటీర్లు బహిష్కరిస్తున్నారని వాపోయారు. ఇందులో భాగంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాలకు పంచాయతీ కార్యదర్శి ఆహ్వానం మేరకు హాజరయ్యామని దీంతో వలంటీర్లు వేడుకలకు హాజరు కాకుండా తమను అవమానించారని పేర్కొన్నారు. సచివాలయ అధికారిక వాట్సాప్ గ్రూపులో తమను పంచాయతీ కార్యదర్శి చేర్చారని, దీంతో వలంటీర్లు అందరూ మూకుమ్మడిగా గ్రూపు నుంచి తొలగిపోయారని తెలిపారు. తమపై వివక్ష చూపుతున్న వలంటీర్లపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - 2022-08-17T05:45:07+05:30 IST