చుక్కాని ఉత్సవంలో అపశ్రుతి
ABN, First Publish Date - 2022-12-07T02:15:04+05:30
తమిళకార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం రాత్రి నిర్వహించిన చుక్కాని ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది.
శ్రీకాళహస్తి, డిసెంబరు 6: తమిళకార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం రాత్రి నిర్వహించిన చుక్కాని ఉత్సవంలో అపశృతి చోటుచేసుకుంది.ఉదయం మహానంది వద్ద చుక్కాని ఉత్సవం నిర్వహించేందుకు వేదపండితులు కలశానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాటిచెట్టుకు శాస్ర్తోక్తంగా పూజలుచేశాక మహానంది వెనుకవైపున దారాలతో లాగి నిలబెట్టారు. తాటిచెట్టు చుట్టూ మట్టలను కప్పారు.అమ్మవారి సన్నిధి వద్ద సోమవారం రాత్రి వెలిగించిన బాలాదీపాలను మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల మధ్య ఊరేగింపుగా తాటిచెట్టు వరకు తీసుకువచ్చి ప్రదక్షిణలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి చుక్కానిని వెలిగించారు. చుక్కానికి జ్యోతి వెలిగించిన వెంటనే ఒకసారిగా చిటపటలాడుతూ భక్తులపైకి నిప్పురవ్వలు ఎగిరిపడ్డాయి.ముందరున్న వారికి తీవ్రసెగలు తాకాయి. దీంతో అందరూ పరుగులు తీసిన క్రమంలో మహానంది నుంచి ఆలయంలోకి వెళ్లే వైపున దారాలు కట్టి ఉండడంతో తగులుకుని పడిపో యారు.చుక్కాని పక్కనే ఉన్న రూ.750 రాహుకేతు పూజామండపంపై మంటలు ఎగసిపడడంతో సీసీ కెమెరాల వైర్లు, విద్యుత్ తీగలు అంటుకున్నాయి.ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాటలో శ్రీదేవి అనే సెక్యూ రిటీగార్డుకు ఎడమచేయి విరిగింది.మరో సెక్యూరిటీగార్డు లక్ష్మికి మంటలతో ఓ చేయి కాలింది. స్వీపర్ సుజాతను భక్తులు తొక్కుకుని వెళ్లడంతో అస్వస్థతకు గురైంది. గాయపడిన ఇద్దరు గార్డులను చికిత్స నిమిత్తం పట్టణ శివారులోని ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మరికొంతమంది మహిళా భక్తులపై నిప్పురవ్వలు ఎగసిపడటంతో చీరలు కాలినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు ప్రైవేటు వైద్యశాలకు వెళ్లి పరామర్శించారు.
Updated Date - 2022-12-07T02:15:05+05:30 IST