దండికుప్పంలో బడి భవనాల కూల్చివేత: టీడీపీ నేతల నిరసన
ABN, First Publish Date - 2022-04-21T05:54:06+05:30
శాంతిపురం మండలం దండికుప్పంలోని ఉన్నతపాఠశాల పాత భవనాలను బుధవారం ఎటువంటి అనుమతులు లేకుండా కూల్చివేశారు.
శాంతిపురం, ఏప్రిల్ 20: మండలం దండికుప్పంలోని ఉన్నతపాఠశాల పాత భవనాలను బుధవారం ఎటువంటి అనుమతులు లేకుండా కూల్చివేశారు. సుమారు డెబ్బై సంవత్సరాల క్రితం దాతలు ఇచ్చిన స్థలంలో పాఠశాల భవనాలు నిర్మించారు. దశాబ్దం క్రితం వరకు అక్కడ తరగతులు జరిగేవి. విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో పన్నెండేళ్ళ క్రితం మరో చోట కొత్తగా నిర్మించిన భవనాల్లోకి పాఠశాలను తరలించారు. ఈ నేపథ్యంలో ఎవరి అనుమతులు, అభిప్రాయాలను తీసుకోకుండా స్థానిక సర్పంచు భర్త పాత పాఠశాల భవనాలను కూల్చివేయించారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. పటిష్ఠంగా ఉన్న ఆ భవనాలకు మరమ్మతులు చేపట్టి ప్రజోపయోగానికి వినియోగించడం విస్మరంచి కూల్చి వేయడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై ఎంపీడీవో హేమమాలిని, ఎంఈవో చంద్రశేఖర్ను వివరణ కోరగా... పాఠశాల భవనాల కూల్చివేతకు తాము ఎవరికీ అనుమతులివ్వలేదన్నారు. అసలు ఆ విషయమే తమ దృష్టికి రాలేదని వారు పేర్కొన్నారు.
పాఠశాల భవనాలను కూల్చివేయడం తగదు
దండికుప్పంలోని పాత పాఠశాల భవనాలను కూల్చివేయడం తగదని మాజీ ఎమ్మెల్సీ గౌనివారిశ్రీనివాసులు, టీడీపీ నేతలు విశ్వనాథనాయుడు, నాగభూషణంరెడ్డి, దేవరాజులనాయుడు, జేపీ వెల్నెస్ ఫౌండేషన్ చైర్మన్ జయప్రకాష్ తదితరులు పేర్కొన్నారు. పటిష్ఠంగా ఉన్న భవనానికి చిన్నపాటి మరమ్మతులు చేపట్టాల్సింది పోయి, అధికారుల అనుమతులు లేకుండా అధికార పార్టీ నేతల కూల్చివేయడం దారుణమన్నారు. పాఠశాల భవనాలను కూల్చివేతకు పాల్పడిన నేతపై అధికారులు సత్వరం చర్యలు తీసుకుని, దాతలిచ్చిన పాఠశాల భవనాల స్థలం దురాక్రమణకు గురికాకుండా చూడాలన్నారు. లేకుంటే తాము ఆందోళనలకు దిగుతామని వారు హెచ్చరించారు.
Updated Date - 2022-04-21T05:54:06+05:30 IST