ప్లాట్ల పేరిట కుచ్చుటోపీ!
ABN, First Publish Date - 2022-11-03T01:13:10+05:30
ఎంఎన్ఆర్ హౌసింగ్ పేరిట ప్లాట్లు విక్రయిస్తానంటూ డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న చిత్తూరు జిల్లావాసి ఎం.నరేష్(37)ను హైదరాబాదు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.
-తిరుపతిలో, హైదరాబాదులో రూ.కోట్ల వసూలు
-రిమాండుకు తరలించిన సిటీ క్రైం పోలీసులు
తిరుచానూరు/వెదురుకుప్పం/హైదరాబాద్ సిటీ, నవంబర్ 2 (ఆంధ్రజ్యోతి): ఎంఎన్ఆర్ హౌసింగ్ పేరిట ప్లాట్లు విక్రయిస్తానంటూ డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న చిత్తూరు జిల్లావాసి ఎం.నరేష్(37)ను హైదరాబాదు సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లె పంచాయతీ పరిధిలోని ఎం.వేణుగోపాలపురం కాలనీకి చెందిన నరేష్ ఏడాది క్రితం హైదరాబాదులోని అమీర్పేటలో ఓ కార్యాలయం స్థాపించాడు.ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అనుచరుడినని, ఎస్సీ కమిషన్ చైర్మన్ విక్టర్ ప్రసాద్ బంధువునని చెప్పి పరిచయాలు పెంచుకున్నాడు. సులభ వాయిదాల పద్ధతిలో ప్లాట్లు అమ్ముతామంటూ వుధృతంగా ప్రచారం చేశాడు.ప్రీ లాంచ్ బుకింగ్ పేరుతో వందలమంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు మియాపూర్, ఎస్ఆర్నగర్ పోలీ్సస్టేషన్లలో ఈ ఏడాది మార్చి నెలలో ఫిర్యాదు చేశారు. కేసును సీసీఎస్కు బదిలీ చేశారు. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.తిరుపతిలో నరేష్ ఉన్నట్లు సమాచారం అందడంతో మంగళవారం అక్కడికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్కు తీసుకొచ్చి కోర్టులో హాజరుపర్చి చంచల్గూడ జైలుకు తరలించారు.ఇప్పటిదాకా రూ. 1.6 కోట్లు జనంనుంచి నరేష్ కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలిలో కూడా ఎంఎన్ఆర్ హౌసింగ్ పేరిట కార్యాలయం ఏర్పాటుచేసిన నరేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు.ఇళ్ల స్థలాల పేరుతో పలువురు బ్యాంకు ఉద్యోగులను, పోలీసు కానిస్టేబుళ్లను మోసం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.తిరుమలయ్య పల్లె సర్పంచ్ ఎం.భారతి కుమారుడైన నరేష్ వెనుకబడిన కులాల వేదిక కన్వీనర్ పేరుతో గతంలో పలు
సమావేశాలు కూడా నిర్వహించినట్లు తెలిసింది.
Updated Date - 2022-11-03T01:13:26+05:30 IST