Chandrababu: జగన్రెడ్డి ఎక్కడున్నావో బయటకు రా...
ABN, First Publish Date - 2022-08-26T19:48:31+05:30
ఇకపై ఏపీలో బ్రిటీష్ పాలన సాగనివ్వనని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.
చిత్తూరు జిల్లా (Chittoor dist.): సీఎం జగన్రెడ్డి (CM Jagan reddy) ఎక్కడున్నావో బయటకు రావాలని, ఇకపై రాష్ట్రంలో బ్రిటీష్ పాలన సాగనివ్వనని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) అన్నారు. శుక్రవారం కుప్పం (Kuppam)లో మూడో రోజు పర్యటిస్తున్నారు. కృష్ణానందపల్లి, గుండ్లనాయనపల్లి, కొత్తూరులో పర్యటన కొనసాగుతోంది. ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలు తిరగబడితే సీఎం జగన్ బయట తిరగలేరన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని తీవ్రస్థాయిలో విమర్శించారు. మద్యాన్ని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి అప్పు తెచ్చారని దుయ్యబట్టారు. బాబాయ్ వివేకను చంపిన వ్యక్తికి ఓట్లడిగే హక్కు లేదన్నారు. వైసీపీ ఆరిపోయే దీపమని... ఇకపై జగన్ ఆటలు సాగవన్నారు. టీడీపీ (TDP) ధర్మ పోరాటానికి ప్రజల సహకారం అవసరమని చంద్రబాబు పిలుపిచ్చారు.
ఏపీలో ఉన్మాది పాలన సాగుతోందని, రాష్ట్రంలో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిన్నటి కుప్పం ఘటన తానెన్నడూ చూడలేదన్నారు. వైసీపీ రౌడీ మూకలతో దాడులకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ రౌడీ ప్రతాపాలు తన దగ్గర కాదు... జగన్ దగ్గర చూపించుకోవాలన్నారు. తానిచ్చిన ఇళ్లను ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు. పులివెందులకు టీడీపీ హయాంలోనే నీళ్లు వచ్చాయని ఈ సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
పేదలకు అన్నంపెట్టే అన్న క్యాంటీన్లను ధ్వంసం చేస్తారా? అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదల పొట్టకొట్టిన వైసీపీ శ్రేణులకు మాట్లాడే అర్హత లేదన్నారు. పోలీసుల కనుసన్నల్లోనే అన్న క్యాంటీన్పై దాడి జరిగిందన్నారు. పోలీస్ వ్యవస్థ భ్రష్టు పట్టడానికి కారణం డీజీపీయేనని అన్నారు. ప్రజలకు టీడీపీ అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. కాగా నమాజ్ కారణంగా చంద్రబాబు తన స్పీచ్ను ఆపేశారు. మరోవైపు నిన్నటి ఘటనల నేపథ్యంలో కుప్పంలో భారీగా పోలీసులు మోహరించారు.
Updated Date - 2022-08-26T19:48:31+05:30 IST