చెరువులో ఆక్రమణల అడ్డగింత
ABN, First Publish Date - 2022-10-01T06:43:56+05:30
గంగవరం సమీపంలోని కొత్తగుంట చెరువు పొరంబోకు స్థల ఆక్రమణను అధికారులు అడ్డుకున్నారు.
సర్వే చేసి చుట్టూ కందకం తవ్వకం
ఆ భవనం ఉన్నదీ చెరువు పొరంబోకు స్థలమే
గంగవరం, సెప్టంబరు 30: గంగవరం సమీపంలోని కొత్తగుంట చెరువు పొరంబోకు స్థల ఆక్రమణను అధికారులు అడ్డుకున్నారు. ఇక్కడి ఆక్రమణలపై ‘చెరువునూ వదల్లేదు’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో శుక్రవారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. వీఆర్వోలు, సర్వేయర్లు, నీటిపారుదల శాఖ అధికారుల ఆధ్వర్యంలో సర్వేనెం.275 లో విస్తరించి ఉన్న కొత్తకుంట చెరువు సరిహద్దులను గుర్తించారు. చెరువు స్థలం ఆక్రమించడంతో పాటు, చెరువు పొరంబోకు స్థలంలో ఏకంగా భవనం నిర్మించినట్టు తేల్చారు. భవనం ఎలా నిర్మించారని ఆక్రమణదారులను అధికారులు ప్రశ్నించారు. ఎక్స్కవేటర్ సాయంతో చెరువు పొరంబోకు స్థలం చుట్టూ కందకం తవ్వించారు. ఆ భవనం కూల్చివేయడానికి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. తమ పరిధిలోని చెరువులను, చెరువు పొరంబోకు.. ఇతర స్థలాలను వీఆర్వోలు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ మురళి ఆదేశించారు.
Updated Date - 2022-10-01T06:43:56+05:30 IST