కొండంత జనం
ABN, First Publish Date - 2022-10-08T05:28:00+05:30
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనిస్థాయిలో కొండకు ప్రవాహంలా యాత్రికులు చేరుకుంటున్నారు.
తిరుమల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి) : తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనిస్థాయిలో కొండకు ప్రవాహంలా యాత్రికులు చేరుకుంటున్నారు. తమిళ భక్తులు పవిత్రంగా భావించే పెరటాశి మాసం మూడవ శనివారాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయంనుంచే తిరుమలకు భక్తులు క్యూకట్టారు.సాయంత్రానికి శ్రీవారి ఆలయం నుంచి సుమారు ఐదారు కిలోమీటర్ల మేరకు సర్వదర్శన భక్తులతో క్యూలైన్ వ్యాపించింది.వైకుంఠం క్యూకాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లతో పాటు నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లన్నీ సర్వదర్శనం భక్తులతో నిండిపోయాయి. శుక్రవారం రాత్రి 8 గంటల సమయానికి నారాయణగిరి విశ్రాంతి భవనంలో వెనుకభాగంలోని రింగ్రోడ్డు మీదుగా గోగర్భం డ్యాం వరకు సర్వదర్శన భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన భక్తులు క్యూలైన్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చలితీవ్రత కూడా అధికమైన క్రమంలో చాలామంది తిరుమల నుంచి దర్శనం చేసుకోకుండానే తిరుగు ప్రయాణమవుతున్నారు.రద్దీ బాగా పెరుగుతున్న క్రమంలో శుక్రవారం రాత్రి 8 గంటలకు క్యూలైన్ను మూసివేశారు.శనివారం ఉదయం 10 గంటల తర్వాత క్యూలైన్లోకి ప్రవేశించాలని మైకుల ద్వారా ప్రచారం చేశారు. అప్పటివరకు తిరుమలలోని యాత్రికులు వసతి సముదాయాల్లో సేదదీరాలని భక్తులకు సూచించారు.అయితే క్యూలైన్లోకి తమను అనుమతించాలంటూ కొంతమంది భక్తులు గోగర్భం డ్యాం వద్దే నిలబడ్డారు. భద్రతా సిబ్బంది వారికి పరిస్థితిని వివరించి 8 గంటల తర్వాత వచ్చిన వారిని అక్కడి నుంచి పంపేశారు.తిరుమలలోని అన్నప్రసాద భవనం, లడ్డూ వితరణ కేంద్రం, అఖిలాండం, బస్టాండ్, గదుల కేటాయింపు కేంద్రాలు, తలనీలాలు సమర్పించే కల్యాణకట్టలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.భక్తుల రద్దీ అధికంగా ఉన్నక్రమంలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి, సీవీఎస్వో నరసింహకిషోర్ గోగర్భం డ్యాం వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. క్యూలైన్లోని భక్తులకు ఆహార పదార్థాలు, తాగునీరు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. గురువారం నుంచే భక్తులు భారీగా వస్తున్నారని, వరుస సెలవులు, పెరటాశి కావడంతో తిరుమల క్షేత్రం యాత్రికులతో కిటకిటలాడుతోందన్నారు. క్యూలైన్లు సరిపోకపోవడంతో శనివారం ఉదయం తిరిగి దర్శనానికి రావాలని కోరామన్నారు. శుక్రవారం రాత్రి సమయానికి క్యూలైన్లోకి ప్రవేశించిన భక్తులందరికీ దర్శనం చేయిస్తామన్నారు. పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని భక్తులు తమ తిరుమల పర్యటనకు ప్రణాళిక రూపొందించుకోవాలని కోరారు. మరోవైపు తిరుమలలో ఎన్నడూ లేనివిధంగా భక్తులు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొన్నారు. రాంభగీచ సర్కిల్ నుంచి నందకం, వరాహస్వామి విశ్రాంతి భవనం వరకు శుక్రవారం రాత్రి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ సిబ్బంది వాహనాలను రింగురోడ్డువైపు కష్టమ్మీద మళ్లించి సమస్యను పరిష్కరించారు.
Updated Date - 2022-10-08T05:28:00+05:30 IST