Chittoor : జిల్లా విభజనపై అభ్యర్థనల లెక్క తేలింది..
ABN, First Publish Date - 2022-03-08T12:47:06+05:30
చిత్తూరు : జిల్లా విభజనపై అందిన అభ్యర్థనల సంఖ్య తేలింది.
చిత్తూరు : జిల్లా విభజనపై అందిన అభ్యర్థనల సంఖ్య తేలింది. మదనపల్లెను రాయచోటి జిల్లాలో విలీనం చేయకుండా ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలంటూ ఈ నెల 3 వ తేదీన 2837 అభ్యర్థనలు అందాయి. నగరి నియోజకవర్గాన్ని బాలాజి జిల్లాలో విలీనం చేయాలంటూ 103, వెదురుకుప్పం మండలాన్ని బాలాజీ జిల్లాలో చేర్చాలంటూ ఆరు అభ్యర్థనలు అందాయి. శ్రీకాళహస్తిని ప్రత్యేక డివిజన్ చేయాలంటూ 9, కుప్పానికి 3, వి.కోటను డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఒకటి చొప్పున అభ్యర్థనలు అందాయి. దీంతోజిల్లా విభజనపై అందిన అభ్యర్థనల సంఖ్య 2959కి చేరాయి. ఈ అభ్యర్థనలపై తీసుకోవాల్సిన చర్యలపై సోమవారం అధికారులతో కలెక్టర్ హరినారాయణన్ సమావేశం అయ్యారు. ప్రభుత్వ మార్గదర్శక సూత్రాల మేరకు సహేతుకమైన అభ్యర్థనలను పరిశీలించి ప్రభుత్వానికి పంపాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జీ డీఆర్వో రాజశేఖర్, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.
పూర్తయిన ఖజానా శాఖ విభజన..
ఖజానా శాఖ విభజన పూర్తయింది. ఇప్పటి వరకు కలెక్టరేట్లో జిల్లా ఖజానా శాఖ ఉండగా, జిల్లా వ్యాప్తంగా 17 సబ్ ట్రెజరీ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. జిల్లాల విభజనతో చిత్తూరు జిల్లాలో 8 ఎస్టీవో కార్యాలయాలు మిగులుతాయి. జిల్లా కార్యాలయంతో పాటు చిత్తూరు, బంగారుపాళ్యం, కుప్పం, నగరి, పుత్తూరు, పుంగనూరు, పలమనేరు ఉన్నాయి. కొత్తగా ఏర్పడే శ్రీ బాలాజీ జిల్లా పరిధిలో తిరుపతి డివిజన్ కార్యాలయంతో పాటు పాకాల, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంంబేడు, చంద్రగిరి కార్యాలయాలు చేరుతాయి. రాయచోటి జిల్లా పరిధిలోకి పీలేరు, వాయల్పాడు, మదనపల్లె, తంబళ్లపల్లె ఎస్టీవో కార్యాలయాలు వెళతాయి. శ్రీ బాలాజీ జిల్లా ఖజానా కార్యాలయాన్ని ప్రస్తుతం మహతి వద్దనున్న డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. బాలాజి జిల్లా కేంద్రానికి చిత్తూరు నుంచి ఏటీవోలు, ఎస్టీవోలను బదిలీ చేయనున్నట్లు తెలిసింది.
Updated Date - 2022-03-08T12:47:06+05:30 IST