రాజ్యసభకు చిరంజీవి? జనసేనలో టెన్షన్!
ABN, First Publish Date - 2022-01-14T22:03:28+05:30
ఏపీలో అధికార వైసీపీ మరో కొత్త పన్నాగానికి తెర తీసిందనే చర్చ ప్రారంభమైంది. సినీ పరిశ్రమపై జరుగుతున్న వివాదాన్ని ప్రభుత్వం పావులా
అమరావతి: ఏపీలో అధికార వైసీపీ మరో కొత్త పన్నాగానికి తెర తీసిందనే చర్చ ప్రారంభమైంది. సినీ పరిశ్రమపై జరుగుతున్న వివాదాన్ని ప్రభుత్వం పావులా వాడుకుంటోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. సీఎం జగన్తో హీరో చిరంజీవి భేటీని అత్యంత వ్యూహాత్మకంగా వాడుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. వైసీపీ కొత్త వ్యూహంలో భాగంగా చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారంటూ అధికార పార్టీ లీకులిస్తోందనే ప్రచారం జరుగుతోంది. వైసీపీకి దూరమవుతున్న కాపు సామాజికవర్గాన్ని మచ్చిక చేసుకునేందుకే కొత్త ఎత్తుగడకు తెర తీశారని అంటున్నారు. జనసేన అధినేత పవన్కల్యాణ్ను నైతికంగా దెబ్బతీసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి కాపు సామాజికవర్గం దూరమైంది.
ఈ సామాజికవర్గాన్ని వైసీపీకి అనుకూలంగా మార్చుకునేందుకు పథకం వేశారని అంటున్నారు. జగన్తో చిరంజీవి భేటీ తర్వాత ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇస్తారంటూ పథకం ప్రకారం ప్రచారం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే.. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్ టీమ్ వ్యూహంలో భాగంగానే ఈ లీకులు అని రాజకీయ పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి చూస్తే పీకే (పవన్ కల్యాణ్)ను దెబ్బకొట్టడానికి పీకే (ప్రశాంత్ కిశోర్) సరికొత్త వ్యూహం పన్నుతున్నారని గుసగుసలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.
Updated Date - 2022-01-14T22:03:28+05:30 IST