సీపీఎస్ రద్దుకు 1న చలో విజయవాడ
ABN, First Publish Date - 2022-08-16T10:08:54+05:30
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్లతో సెప్టెంబరు 1వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెడుతున్నట్టు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎ్సఈఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రొంగలి అప్పల్రాజు, పార్ధసారథి తెలిపారు.
- కార్యక్రమ విచ్ఛిన్నానికి ప్రభుత్వ తొత్తు సంఘం కుట్ర
- అందుకే అదే రోజున పోటీ కార్యక్రమం చేపట్టారు
- అయినా చలో విజయవాడ ఆగదు: ఏపీసీపీఎస్ఈఏ
విజయవాడ, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్లతో సెప్టెంబరు 1వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని తలపెడుతున్నట్టు ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం (ఏపీసీపీఎ్సఈఏ) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రొంగలి అప్పల్రాజు, పార్ధసారథి తెలిపారు. ప్రతి సీపీఎస్ ఉద్యోగి, కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. గత ఏడేళ్లుగా సీపీఎస్ రద్దు కోసం ఎన్నో ఆందోళనలు చేస్తూ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నామని అప్పల్రాజు, పార్థసారథి తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల సమస్యలపై ప్రధాన సంఘంగా తాము పోరాటం చేస్తున్నామన్నారు.
ఒకవైపు సీపీఎస్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రధాన సంఘంగా పోరాటం జరుపుతూనే, మరోవైపు సోదర ప్రభుత్వ తొత్తు సంఘాలతో కూడా పోరాటం చేస్తున్నామన్నారు. సమస్యలపై కలిసి పోరాడాల్సిన పరిస్థితులలో.. తాము తలపెట్టిన చలో విజయవాడ సందర్భంలోనే.. సీఎం క్యాంపు ముట్టడి పేరుతో పోటీ కార్యక్రమం తల పెడితే ఎవరికి ప్రయోజనం కలుగుతుందో ఏపీసీపీఎ్సయూఎస్ ఆలోచించుకోవాలని హితవు పలికారు. తమతో కలిసి వచ్చే ఇతర సంఘాలను కలుపుకొని వెళ్తున్నామని, ఏపీసీపీఎ్సయూఎస్ వంటి చిన్న సంఘం కూడా కలిసి వస్తామంటే ఆహ్వానించామని తెలిపారు. తమ ఆందోళనను విచ్ఛిన్నం చేయటానికి ప్రభుత్వ తొత్తు సంఘాలు ఎన్ని కుట్రలకు పాల్పడినా చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు.
Updated Date - 2022-08-16T10:08:54+05:30 IST