ఏం చేశారని వైసీపీకి ప్రజలు ఓట్లు వేయాలి: GVL
ABN, First Publish Date - 2022-04-29T18:35:17+05:30
రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని వైసీపీకి ప్రజలు ఓట్లు వేయాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు.
అమరావతి: రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని వైసీపీకి ప్రజలు ఓట్లు వేయాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఇంటింటికి వెళ్లి వైసీపీ పంచే కరపత్రాల్లో చెప్పినవన్నీ కేంద్రం ఇచ్చిన పథకాలే అని అన్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చినా జనం పక్కన పెట్టారని తెలిపారు. వైసీపీని కూడా ఈసారి ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు ఓ అవగాహనతో ఉన్నాయని అన్నారు. మూడో పార్టీని రాష్ట్రంలో రానీయకుండా చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఒక్కరే ఉండటం రాష్ట్రంలో మనం చూస్తున్నామని తెలిపారు. బీజేపీలో అలా ఉండదని, కుటుంబ పార్టీలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఇప్పుడు ఏపీలో చూస్తున్నామన్నారు. మంత్రులు కూడా ముఖ్యమంత్రి కాళ్లపై పడటం ఏంటని ప్రశ్నించారు. పెద్ద వయసులో ఉన్న వారు కూడా ఆత్మాభిమానం పక్కన పెట్టారని జీవీఎల్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2022-04-29T18:35:17+05:30 IST