సీఎం వచ్చారు చుక్కలు చూపిస్తాం!
ABN, First Publish Date - 2022-02-10T07:44:59+05:30
‘ముఖ్యమంత్రి వచ్చారు. ఇక... మీకు చుక్కలు చూపిస్తాం’’ అంటూ పోలీసులు విశాఖ నగర వాసులను నానా ఇక్కట్లకు గురి చేశారు...
జగన్ రాకతో విశాఖ వాసులకు నరకం
ప్రధాన రహదారుల్లో గంట ట్రాఫిక్ బంద్
విమాన ప్రయాణికులకు అష్టకష్టాలు
లగేజీతో రెండు కిలోమీటర్ల నడక
సాయంత్రం దాకా దుకాణాలన్నీ బంద్
విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ‘‘ముఖ్యమంత్రి వచ్చారు. ఇక... మీకు చుక్కలు చూపిస్తాం’’ అంటూ పోలీసులు విశాఖ నగర వాసులను నానా ఇక్కట్లకు గురి చేశారు. సీఎం జగన్ శారదా పీఠానికి వచ్చిన ప్రతిసారీ గంటలకొద్దీ ట్రాఫిక్ ఆపేసి, దుకాణాలు మూయించి నరకం చూపిస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు అనేక మంది ముఖ్యమంత్రులు విశాఖకు వచ్చారు. అయితే... సీఎం రావడానికి ఐదు నుంచి 10 నిమిషాలపాటు మాత్రమే ట్రాఫిక్ను నియంత్రించడం రివాజు. కానీ... జగన్ సీఎం అయ్యాక సీన్ మారిపోయింది. హైవేలు, ప్రధాన రహదారులతో నిమిత్తంలేదు. ఎక్కడైనా, ఎవరైనా కనీసం గంటపాటు ఆగిపోవాల్సిందే. బుధవారం ఉదయం 11.55 గంటలకు విశాఖపట్నం విమానాశ్రయంలో దిగి, అక్కడి నుంచి ఎన్ఏడీ జంక్షన్ మీదుగా రోడ్డు మార్గంలో విశాఖ శారదా పీఠానికి జగన్ వెళ్లారు. అక్కడ పూజలు నిర్వహించి తిరిగి మధ్యాహ్నం 3.35 గంటలకు బయలుదేరి అదే మార్గంలో విమానాశ్రయానికి వెళ్లారు. సీఎం కోసం విశాఖ నగర పోలీసులు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సీఎం విమానాశ్రయానికి వస్తున్నారంటూ మధ్యాహ్నం 2.30 గంటల నుంచే... ఎక్కడి వాహనాలు అక్కడ ఆపివేశారు. గాజువాక నుంచి వచ్చే వాహనాలను జాతీయ రహదారిపై షీలానగర్ వద్ద, నగరం నుంచి వచ్చే వాహనాలను ఎన్ఏడీ జంక్షన్ వద్ద, అరకులోయ నుంచి వచ్చే వాహనాలను పెందుర్తి జంక్షన్ వద్ద నిలిపేశారు. సుమారు గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు నానా ఇక్కట్లు పడ్డారు. సాయంత్రం 4 గంటలకు విజయవాడ, హైదరాబాద్కు విమానాల్లో వెళ్లాల్సిన ప్రయాణికులు నానా తంటాలు పడ్డారు. ‘ప్లీజ్... ప్లీజ్’ అని పోలీసులను బతిమాలినా ఫలితం లేకపోయింది. బోర్డింగ్ సమయం ముగిసిపోతుండటంతో కార్లు దిగేసి, తమ లగేజీతో సుమారు 2 కిలోమీటర్లు నడిచి మరీ విమానాశ్రయానికి చేరుకున్నారు.
దుకాణాలన్నీ మూసివేత
ముఖ్యమంత్రి శారదా పీఠానికి వస్తున్నారంటూ పెందుర్తి నుంచి వేపగుంట వరకు... 2 కిలోమీటర్ల పొడవునా దుకాణాలన్నీ ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకూ మూసివేయించారు. ఎన్ఏడీ జంక్షన్ నుంచి గోపాలపట్నం పెట్రోల్ బంక్ వరకు దుకాణాలు తెరవడానికి అనుమతించినా... ఆ మార్గంలోకి వాహనాలు రాకుండా వీధుల ముందు బారికేడ్లు పెట్టారు. రహదారి పక్కన దుకాణాల వద్ద ఎవరూ వాహనాలు పార్కింగ్ చేయకుండా ఆంక్షలు పెట్టారు. దీంతో... ఆయా ప్రాంతాల్లో వ్యాపార లావాదేవీలు నిలిచిపోయాయి. సీఎం విమానాశ్రయానికి చేరుకున్న తరువాత అంతా ఒకేసారి రోడ్లపైకి రావడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. అప్పటివరకు అక్కడే ఉండి వాహనాలను అడ్డుకున్న పోలీసులు, సీఎం వెళ్లగానే ఇక ‘మీ పాట్లు మీరు పడండి’ అంటూ అక్కడి నుంచి జారుకున్నారు. ‘‘నేను మాజీ మంత్రి కుమార్తెను. సీఎం కోసం ప్రజలను ఇలా ఆపడం ఎప్పుడూ చూడలేదు. పదేళ్ల క్రితం ఎప్పుడో సినిమాల్లో చూపించారు. ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం’’ అని ఒక మహిళ పోలీసులపై మండిపడ్డారు.
Updated Date - 2022-02-10T07:44:59+05:30 IST