మేరిమాత, ఏసుక్రీస్తు విగ్రహాల ధ్వంసం
ABN, First Publish Date - 2022-05-16T08:30:58+05:30
మేరిమాత, ఏసుక్రీస్తు విగ్రహాల ధ్వంసం
పల్నాడు జిల్లాలో దుండగుల దుశ్చర్య
యడ్లపాడు, మే 15: పల్నాడు జిల్లా యడ్లపాడు పరిధిలోని ఎర్రకొండపై ఉన్న రహదారిమాత దేవాలయం వద్ద గుర్తు తెలియని దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. చెన్నై-కోల్కతా పదహారో నంబరు జాతీయరహదారి పక్కన ఉన్న ఈ దేవాలయంలో శనివారం అర్ధరాత్రి మేరిమాత, ఏసుప్రభువు విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేశారు. తెల్లని వస్త్రానికి పసుపుకొమ్ము కట్టి మేరిమాత విగ్రహం మెడలో వేశారు. ఆదివారం ఉదయం ప్రార్థనలకు వెళ్లిన భక్తులు, మత పెద్దలు కొండపైకి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు, చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారావు, అర్బన్ సీఐ రాజేశ్వరరావుతోపాటు యడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట మండలాల ఎస్ఐలు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మత పెద్దలు, భక్తులతో మాట్లాడారు. క్లూస్టీంలు, డాగ్స్వాడ్లను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నామని తెలిపారు.
అలజడులు సృష్టిస్తే సహించం : మంత్రి రజిని
సంఘటన ప్రాంతాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని సందర్శించి ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు.
విగ్రహాల ధ్వంసం ఉన్మాద చర్య
మేరిమాత, ఏసుప్రభువు విగ్రహాలను ధ్వంసం చేయడం ఉన్మాదచర్యగా మాజీమంత్రి, టీడీపీ రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అభివర్ణించారు. ఆదివారం సంఘటన స్థలాన్ని సందర్శించిన ఆయన మాట్లాడుతూ దోషులు ఎంతటి వారైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.
క్రైస్తవ సంఘాల ధర్నా
మేరిమాత, ఏసుక్రీస్తు విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా క్రైస్తవ సంఘాల నాయకులు, సంఘస్తులు ఆదివారం సాయంత్రం ధర్నాకు దిగారు. జాతీయరహదారిపైకి చేరుకుని రోడ్డుకు ఇరువైపులా వాహనాలను నిలిపివేసి రాస్తారోకో నిర్వహించారు.
Updated Date - 2022-05-16T08:30:58+05:30 IST