ఏపీలో విఫలమైన గడపగడపకు కార్యక్రమం
ABN, First Publish Date - 2022-06-08T21:26:25+05:30
ఏపీలో గడపగడపకు కార్యక్రమం విఫలమైంది. గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సమస్యలపై వైసీపీ
అమరావతి: ఏపీలో గడపగడపకు కార్యక్రమం విఫలమైంది. గడపగడపలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. సమస్యలపై వైసీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకతను గడపగడప కార్యక్రమం చాటిచెప్పింది. ఈ నేపథ్యంలోనే గడపగడపపై సీఎం జగన్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాపుకు రీజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరైనారు. వైసీపీ ప్రజాప్రతినిధులకు జగన్ పలు సూచనలు చేశారు. 'గడపగడప' కార్యక్రమం 8 నెలల పాటు కొనసాగుతుందని, ఒక్కో గ్రామంలో 2 రోజులపాటు నిర్వహించాలని సీఎం సూచించారు. నెలలో 20 రోజులు గడపగడపకు వెళ్లాలని సూచించారు. నెలకోసారి వర్క్షాప్ నిర్వహిస్తామని జగన్ ప్రకటించారు.
అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు గడపగడప సెగ ఊపిరాడనీయడం లేదు. ఏ ఇంటికి వెళ్తే ఏం జరుగుతోందోననే భయం వీరిని గడగడలాడిస్తోంది. ఎక్కడ ఏ వీడియో బయటకు వచ్చి పరువు తీసేస్తుందోననే వణుకు పుట్టిస్తోంది. ఇంటింటికి వెళ్తే ముందు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ప్రజలు తిరగబడు తుండడంతో తలెత్తుకోలేక ఇప్పుడు అధికార పార్టీ నేతలు తలపట్టుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజవర్గాల్లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తిగా నీరసించిపోయింది. గతనెల 11న ఆర్భాటంగా మొదలుపెట్టిన కార్యక్రమం కాస్తా చల్లబడిపోయింది. ఎక్కడకు వెళ్లినా ఆందోళనలు వ్యక్తమవుతుండడంతో పలువురు ఎమ్మెల్యేలు ఏ గడప వద్దకు వెళ్లాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. ఈ భయంతో రానున్న ఎనిమిది నెలలు జనంలో ఎలా తిరగాలో తెలియక మథనపడుతున్నారు.
Updated Date - 2022-06-08T21:26:25+05:30 IST