ఆ స్థలం మాదే..!
ABN, First Publish Date - 2022-08-10T05:40:43+05:30
‘ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఎకరం స్థలం మాదే. 1930లలో మా తాతగారి నుంచి సంక్రమించిన ఆస్తి’ అని ధర్మవరం ప్రాంతానికి చెందిన కొందరు జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.
ఐటీఐ కళాశాల స్థలంపై వివాదం.. పోలీసులకు ప్రిన్సిపాల్ ఫిర్యాదు
అనంతపురం క్రైం, ఆగస్టు 9: ‘ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో ఎకరం స్థలం మాదే. 1930లలో మా తాతగారి నుంచి సంక్రమించిన ఆస్తి’ అని ధర్మవరం ప్రాంతానికి చెందిన కొందరు జోక్యం చేసుకోవడం వివాదాస్పదంగా మారింది. ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ మహబూబ్ బీ, టూటౌన పోలీసులు తెలిపిన వివరాల మేరకు, ధర్మవరం పట్టణానికి చెందిన అంజనరెడ్డితో పాటు కొందరు వ్యక్తులు కోర్టు రోడ్డు పక్కనే ఉన్న ప్రభుత్వ ఐటీఐ కళాశాలలోకి మంగళవారం ప్రవేశించారు. కళాశాల ఆవరణలోని స్థలంలో గుంతలు తవ్వడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ అక్కడికి వెళ్లి ఎందుకు తవ్వుతున్నారని ప్రశ్నించారు. ఆ స్థలంపై తమకు హక్కు ఉందని, తాతల కాలం నాటిదని వారు సమాధానమిచ్చారు. డాక్యుమెంట్లు ఉన్నాయా అని ప్రిన్సిపాల్ అడిగితే, పలు పత్రాలు చూపించారని తెలిసింది. ఈ విషయంలో స్పష్టత లేకపోవంతో టూటౌన పోలీసులకు ప్రిన్సిపాల్ ఫిర్యాదు చేశారు. టూటౌన ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేశారు. అంజనరెడ్డితో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది.
ఏమిటీ వివాదం..?
ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఎకరా స్థలం ప్రైవేట్ వ్యక్తులదనే అంశంపై చాలాకాలంగా చర్చ జరుగుతోంది. కొందరు యువకులు తరచూ కళాశాల ఆవరణంలోకి వస్తున్నారు. అదీ.. ప్రధాన ద్వారం వెంట కాకుండా వెనుకవైపు నుంచి వస్తున్నట్లు తెలుస్తోంది. వీరు అక్కడ గుంతలు తవ్వి పోల్స్ నాటుతున్నారు. 2018లోనూ ఈ విషయంపై వివాదం నడిచింది. ప్రిన్సిపాల్ మహబూబ్బీ గతంలో రెండుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులదే అయితే.. ఇన్నేళ్ల పాటు ఎందుకు పట్టించుకోలేదు...? ఈ మధ్యకాలంలోనే ఆ స్థలం కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నారు...? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక రాజకీయ నాయకుల హస్తముందా...? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
Updated Date - 2022-08-10T05:40:43+05:30 IST