పార్నపల్లి డ్యాం మత్స్య సంపదపై అధికార పార్టీ నాయకుడి కన్ను
ABN, First Publish Date - 2022-07-21T04:52:04+05:30
జిల్లాలో మత్స్యసంపదపై అధికార పార్టీకి చెందిన కొందరు నాయ కులు కన్నేశారు. అధికారం అండతో యథేచ్ఛగా అక్రమా ర్జనకు తెరలేపారు.
అధికార దర్పంతో సొసైటీ నుంచి చేపల కొనుగోలు
తక్కువ ధరకే చేపల కొనుగోలు
ఏడాదికి రూ.అరకోటి లాభం
చక్రం తిప్పుతున్న ఓ ప్రజాప్రతినిధి అనుచరుడు
అనంతపురం ప్రెస్క్లబ్, జూలై20: జిల్లాలో మత్స్యసంపదపై అధికార పార్టీకి చెందిన కొందరు నాయ కులు కన్నేశారు. అధికారం అండతో యథేచ్ఛగా అక్రమా ర్జనకు తెరలేపారు. ఇందుకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్(పార్నపల్లి డ్యాం) వేదికైంది. ఈ రిజర్వాయర్ కొన్నేళ్ల కిందట జిల్లాల విస్తరణలో భాగంగా కడప జిల్లాకు చేరినప్పటికీ... అప్పట్లోనే ఈ రిజర్వాయర్ కింద మత్స్యశాఖ అధికారులు ఓ సొసైటీని ఏర్పాటు చేశారు. ఆ సొసైటీ అనంతపురం జిల్లా కిందకు వచ్చినట్లయింది. అప్పటి నుంచి జిల్లా నుంచే కార్యకలాపాలన్నీ సాగుతున్నాయి. జిల్లా అధికారులే ప్రతి ఏడాది అందులో చేపపిల్లలను వదులుతున్నారు. జిల్లాకు సొసైటీ అనుసంధానంగా ఉండటంతో శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధి అనుచరుడొకరు రిజర్వాయర్పై కన్నేశారు. మూడేళ్లుగా ఆ సొసైటీ సభ్యులు, మత్స్యకారు లను భయపెడుతూ మత్స్య సంపదను అతితక్కువ ధరకు కొనుగోలు చేస్తూ మత్స్యకారుల కడుపుకొడుతున్నట్లు సమా చారం. దీంతో మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మత్స్యశాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది.
అధికార దర్పంతో సొసైటీ నుంచి చేపల కొనుగోలు
అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు దళారీల అవతారమెత్తి మత్స్యసంపదను అప్పనంగా దోచేస్తున్నట్లు సమాచారం. 100 టన్నులకుపైగా మత్స్యసంపద లభించే రిజర్వాయర్లనే టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్, కదిరి నియోజకవర్గంలో చెర్లోపల్లి రిజర్వాయర్, పుట్టపర్తి నియోజకవర్గంలో మారాల రిజర్వాయర్లను హెచఎనఎస్ అధికారుల నిర్లక్ష్యం... అధికార పార్టీ నేతల మెప్పుకోసం మత్స్యశాఖకు అప్పగించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా మూడేళ్లుగా ఆ రిజర్వాయర్లలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు చేపలను వదులుకొని సొమ్ము చేసుకుంటూ మత్స్యకారులకు అన్యాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో... కడప, అనంత జిల్లాలకు మధ్యలో ఉన్న సీబీఆర్(పార్నపల్లి డ్యాం)పై శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అనుచరుడి చూపు పడింది. ఈ డ్యాంలో 100 టన్నులకుపైగా చేపల పెంపకం చేపట్టే సామర్థ్యం ఉండటంతో ఆ నేత రిజర్వాయర్ను తన గుప్పిట్లో పెట్టుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆ డ్యాంకింద ఉన్న సొసైటీ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఏటా రూ. అరకోటికిపైగా దండుకున్నట్లు సమాచారం. తాను చెప్పిన ధరకే చేపలను తనకు అమ్మాలని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలు స్తోంది. ఎవరైనా కాదూకూడదని ప్రశ్నిస్తే... తన అనుచరులతో బెదిరిస్తున్నట్లు సమాచారం.
ప్రతిఏటా మత్స్యకారులకు రూ. అరకోటి నష్టం
మత్స్యకారులు పార్నపల్లి డ్యాంలో చేపలను బహిరంగ మార్కెట్లో టన్ను రూ. 90 వేల నుంచి రూ. లక్ష వరకూ అమ్ముకునేవారు. వచ్చిన ఆదాయంలో సొసైటీ సభ్యులంద రూ సమానంగా పంచుకునే వారు. ఈ లెక్కన ఆ డ్యాం పరిధిలో 100 టన్నుల సంపదను టన్ను రూ. 90 వేలతో లెక్క వేసుకున్నా... రూ. 90 లక్షల వరకూ ఆదాయం వస్తుంది. అందులో సగం పెట్టుబడికి తీసేసినా.. మిగిలిన ఆదాయంలో సొసైటీ కింద ఉన్న వందల సంఖ్యలో సభ్యులు సమానంగా పంచుకునేవారు. అయితే ఆ అధికార పార్టీ నేత గత మూడేళ్లుగా రూ. 40 వేలు, రూ. 50 వేలలోపే టన్ను చేపలను కొంటుండటంతో నష్టాలపాలవు తున్నామని పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అరకోటికిపైగా నష్టపోతున్నట్లు పలువురు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మా వెనుక ఎమ్మెల్యే ఉన్నారు...
‘మా వెనుక ఎమ్మెల్యే ఉన్నారు. మేము చెప్పినట్లు వినండి. లేదంటే ఏం జరుగుతుందో తరువాత మీకు తెలుస్తుంది’ అంటూ ఆ నేత వెంట కొందరు నాయకులు సొసైటీ సభ్యులు, మత్స్యకారులను బెదిరిస్తున్నట్లు సమాచారం. పార్నపల్లికి సమీపంలో శ్రీసత్యసాయి జిల్లాలోని ఓ నియోజకవర్గానికి చెందిన గ్రామాలు ఉండ టం, సొసైటీ జిల్లాశాఖ పరిధి కిందకు రావడంతో ఆ నేత అక్రమార్జనకు మార్గం సుగమం అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిఏటా సీజన ప్రారంభమయ్యే సమయంలో అక్కడకు రావడం... సొసైటీ సభ్యులను ముందుగానే భయభ్రాంతులతో గుప్పిట్లో పెట్టుకోవడం... పంటచేతికొచ్చే సమయానికి నెలరోజుల ముందు నుంచే చేపలను అప్పనంగా నొక్కేసేందుకు సిద్ధమవుతున్నాడన్న విమర్శలు ఉన్నాయి. సీజన ప్రారంభానికి నెల రోజులు సమయం ఉంటటంతో ఇప్పటికే ఆ నేత తన మనుషులను ఆ డ్యాం వద్దకు పంపి పరిశీలించినట్లు సమాచారం.
మత్స్యకారులకు నష్టం జరగకుండా చూడాలి: బెస్త కుళ్లాయప్ప, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జాతీయ మత్స్యకారుల సంఘం
పార్నపల్లి డ్యాం చేపల సంపద మత్స్యకారులకు అందేలా జిల్లా అధికారులు చూడాలి. స్థానికంగా కొందరు నేతలు వస్తూ చేపలను కొనుగోలు చేస్తూ... మత్స్యకారులకు నష్టం చేకూరుస్తున్నారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు స్పందించి మత్స్యకారులకే సంపదను అమ్ముకునే వెసులుబాటు కల్పించాలి. ఆ మేరకు వారి జీవనోపాధుల మెరుగు కోసం చర్యలు తీసుకోవాలి.
Updated Date - 2022-07-21T04:52:04+05:30 IST