సచివాలయ ఉద్యోగులకు Jagan Sarkar షాక్..!
ABN, First Publish Date - 2022-01-13T06:45:49+05:30
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కారు షాక్ ఇచ్చింది. న్యాయం కోసం..
- న్యాయం కోరితే శిక్ష..!
- ఈనెల 10న నిరసనలు తెలిపిన ఉద్యోగులకు..
- ఒక రోజు జీతం కట్ చేసిన అధికారులు
- 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ కొన్నిచోట్ల మెమోలు జారీ
అనంతపురం విద్య, జనవరి 12: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కారు షాక్ ఇచ్చింది. న్యాయం కోసం నిరసన తెలిపిన ఉద్యోగులకు జీతం కట్ చేయడంతోపాటు, క్రమశిక్షణ చర్యలకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో మెమో ఇచ్చిన అధి కారులు, తాజాగా బుధవారం జీతం కట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రొద్దం మండలంలో 145 మందికి ఈనెల 10వ తేదీకి సంబంధించిన జీతం నిలిపివేయాలంటూ ఎంపీడీఓ ఉత్తర్వులు జారీచేశారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మెమో జారీచేశారు. 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలనీ, లేకుంటే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై సచివాలయ ఉద్యోగులతోపాటు, ఇతర ఉ ద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
న్యాయం కోసం నినదిస్తే..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఈనెల 10న జిల్లావ్యాప్తంగా నిరసనలు తెలిపారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లావ్యాప్తంగా 63 మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని ఉద్యోగులు నిరసన తెలిపారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు వినతిపత్రాలు అందించారు. 24 గంటలు తిరక్కుండానే వారిపై వేధింపులు మొదలయ్యాయి. కొందరు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. విధులకు గైర్హాజరైనందుకు రొద్దం మండలంలోని పంచాయతీ కార్యదర్శులు గ్రేడ్-5, సచివాలయ ఉద్యోగులు ఏకంగా 145 మందికి 10వ తేదీ జీతం నిలిపివేస్తూ ఎంపీడీఓ రాబర్ట్ విల్సన్ ఉత్తర్వులు జారీ చేశారు. డీడీఓలు 10వతేదీ జీతాలు చెల్లిస్తే వారిపై కూడా క్రమశిక్షణా చర్యలు తీసు కుంటామన్నారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో సైతం ఈనెల 11వ తేదీ మున్సిపాలిటీ పరిధిలోని 11 సచివాలయాల్లోని ఉద్యోగులపై చర్యలకు దిగారు. అందరికీ మెమో జారీ చేశారు. ఎగ్జిక్యూటివ్ అథారిటీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సామూహిక విధుల బహిష్కరణ, అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేయడం, ఓటీఎస్ మేళాలో పాల్గొనకపోవడం, అధికారిక వాట్సాప్ గ్రూప్ల నుంచి వైదొలగడం వంటి 4 అంశాలపై 24 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలంటూ కమిషనర్ మెమో జారీ చేశారు. బెళుగుప్పలో 134 మందికి ఒకరోజు జీతం కట్ చేస్తామని చెప్పినట్లు సమాచారం.
చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తుంటే...
జిల్లావ్యాప్తంగా 1207 గ్రామ, వార్డు సచివాలయాలుండగా, 10665 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. ప్రొబేషన్ డిక్లేర్ చేసి న్యూ పేస్కేల్ మేరకు జీతాలు ఇస్తే తమ బతుకుల్లో ఉషస్సులు వస్తాయని భావించారు. రెండేళ్లు దాటి మూడు నెలలు కావస్తున్నా ప్రొబేషన్ డిక్లేర్ చేయకపోవడంతోనే 10 వేల మందికిపైగా ఉద్యోగులు న్యాయం కోసం రోడ్డెక్కారు. శాంతియుతంగా నిరసనలు తెలిపారు. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, జేసీలకు, కలెక్టర్కు వినతిపత్రాలు ఇచ్చారు. వారి సమస్యను, మనోవేదనను అర్థం చేసుకోకుండా జీతాలు కట్చేయడం, మెమోలు ఇచ్చి వేధించేలా ఉత్తర్వులు జారీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - 2022-01-13T06:45:49+05:30 IST